ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో వైఎస్ విగ్రహం కూల్చివేత వివాదానికి కారణమైంది. ఈ ఘటనపై వైటీపీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో ముఖం చెల్లక.. ప్రజలు చీదరించుకుంటున్నారని.. ఆ అసహనంతో వైఎస్ విగ్రహాలను కూల్చుతున్నారా? అని ప్రశ్నించారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పుడుతున్నారని అన్నారు షర్మిల. తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని దౌర్బాగ్యులకు ఎదురుగా వచ్చి పోరాడే దమ్ము లేదా? అని ప్రశ్నించారు. ధైర్యం లేక వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారా? అని ఫైరయ్యారు.
దమ్ముంటే తమతో చర్చకు రావాలని సవాల్ చేశారు షర్మిల. చర్చించే దమ్ములేని దద్దమ్మలు విగ్రహాలు కూల్చినంత మాత్రాన.. జనం గుండెల్లో కొలువైన రాజశేఖర్ రెడ్డి స్థానాన్ని ఎవరూ కూల్చలేరని చెప్పారు.
వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చిన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టప్రకారం శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు షర్మిల. ఈ చర్యలకు పాల్పడిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.