ప్రపంచంలోని అతి పెద్ద గిరిజన జాతరల్లో ఒక్కటి నాగోబా జాతర. తెలంగాణ రాష్ట్రం లో మేడారం జాతర తరువాత అత్యంత ప్రజాదరణ పొందిన గిరిజనుల జాతర కూడా నాగోబా జాతరే. అందుకే ఇది రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. నాగోబా ఆలయం ఇంద్రవెళ్ళి మండలం లోని కేస్లాపూర్ లో ఉంది. ఈ జాతరకు ప్రస్తుతం అన్నీ ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి.
పుష్య మాసం రోజున నెలవంక కనిపించగానే మెస్రం వంశీయులు ఉత్సాహంతో ఉప్పొంగిపోతారు. ఎందుకంటే గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబా జాతర అప్పుడే ప్రారంభమవుతుంది కాబట్టి. ఈ జాతర జనవరి 21 న ప్రారంభం కానుంది. ఈ జాతర ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. వారం రోజులపాటు భక్తి శ్రద్ధలతో, వైభవంగా ఆదివాసులు నిర్వహిస్తారు.
తమ ఆరాధ్య దైవం నాగోబా దేవుడి అభిషేకానికి అవసరమైన గంగాజలం కోసం ఆదివాసీలు గోదావరికి మహా పాదయాత్రగా జనవరి 1 న బయలుదేరి వెళ్లారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లోని కలమడుగు ప్రాంతం లోని గోదావరి జలాన్ని తీసుకువచ్చేందుకు పాద రక్షలు లేకుండా కేస్లాపూర్ నుంచి బయలు దేరిన భక్తులు ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ అటవీ ప్రాంతం నుంచి ఈ నెల 10 న గోదావరికి చేరుకుంటారు. అక్కడ సేకరించిన జలంతో ఈ నెల 17 న తిరిగి నాగోబా ఆలయానికి చేరుకుంటారు.
జనవరి 21 వ తేదీన రాత్రి 10 గంటలకు గంగా జలంతో నాగోబా సన్నిధిలో దేవుడికి అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం మహాపూజ నిర్వహించి జాతర ప్రారంభిస్తారు. ఈ జాతర వారం రోజులపాటు కన్నుల పండువగా జరుగుతుంది. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు , పూజారి కోసు ప్రధాన్ దాదేరావు సమక్షం లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.