బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఆదివారం భక్తులతో ఇంద్ర కీలాద్రి కిటకిటలాడుతోంది. మూలా నక్షత్రం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా ఆదివారం కనక దుర్గమ్మ సరస్వతి దేవీగా దర్శనమిచ్చారు. దీంతో అర్థరాత్రి నుండే క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. వినాయకగుడి నుండి చిన్న రాజగోపురం
వరకు భక్తులతో క్యూ లైన్స్ కిక్కిరిసిపోయాయి.
అందులోనూ అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం ఆఫీసులకు, స్కూళ్లకు, కాలేజీలకు సెలవు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా వస్తున్నారు భక్తులు. భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ అధికారులు, పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 5 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కెనాల్ రోడ్డు వినాయకుడి గుడి వద్ద నుండి 27 కంపార్ట్ మెంట్లు ఏర్పాటు చేసి భక్తులను దర్శనాలకు వదులుతున్నారు పోలీసులు.
అంతే కాకుండా మూలా నక్షత్రం కావడంతో ఇంద్ర కీలాద్రి వైపుగా ట్రాఫిక్ మళ్లింపులు కొనసాగుతున్నాయి. వైజాగ్ నుంచి చెన్నయ్ వెళ్లేవి హనుమాన్ జంక్షన్ వైపు, చెన్నై వెళ్లేవి బాపట్ల వైపు, హైదరాబాద్ వెళ్లేవి ఇబ్రహీంపట్నం వైపు వాహనాలను మళ్లిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చే వాహనాలు సితార, సీవీఆర్ ఫ్లై ఓవర్ మీదుగా మళ్లింపులు జరుగుతున్నాయి. అలాగే గుంటూరు వైపు
నుంచి వచ్చే వాహనాలు తోవగుంట వద్ద మళ్లిస్తున్నారు పోలీసులు.
మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్. సీఎం రాకతో ఇంద్రకీలాద్రిపై మరింత భద్రతను పెంచారు ఆలయ అధికారులు. అన్ని వీఐపీ దర్శనాలను రద్దు చేసి, కేవలం సర్వ దర్శనాలను మాత్రమే అనుమతినిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో భ్రమరాంబ మీడియాతో మాట్లాడుతూ.. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దర్శన సమయాన్ని పెంచామన్నారు. ఎలాంటి వీఐపీ దర్శనాలను అనుమతించడం లేదని స్పష్టం చేశఆరు. అన్ని క్యూ లైన్స్ ఉచితమేనన్నారు. రెండు లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.