టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ అన్నమయ్య మూడవ ఘాట్ రోడ్ పనులకు (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) డీపీఆర్ తయారు చేయండి అని ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటనతో శ్రీవారి భక్తులు, స్థానికులు అన్ని వర్గాల వ్యాపారస్తులలో భయాందోళనలు కలుగుతున్నాయి. టీటీడీ ధర్మకర్తల మండలిలో ఒక నిర్ణయం తీసుకునే ముందు స్థానికులు, శ్రీవారి భక్తులు, గతంలో అక్కడ పనిచేసిన అధికారుల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకోవాలి. టీటీడీ ధర్మకర్తల మండలి తీసుకునే నిర్ణయాలు భక్తులు మెచ్చే విధంగా పది కాలాల పాటు నిలిచే విధంగా ఉండాలి. అంతే తప్ప తొందరపాటు నిర్ణయాల కారణంగా భక్తులు, స్థానికులు హైకోర్టును ఆశ్రయించేలా ఉండకూడదు.
నిపుణుల సూచనలు పాటిస్తున్నారా? లేకపోతే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారా అన్న అనుమానాలు స్థానికులలో, శ్రీవారి భక్తులలో కలుగుతున్నాయి. తిరుమలకు అన్నమయ్య నడక మార్గాన్ని యధావిధిగా కొనసాగించండి. 3 వ ఘాట్ రోడ్ ప్రతిపాదనతో తిరుమల తిరుపతికి ఉన్న అనుబంధాన్ని విడదీయకండి. శ్రీవారి ఆగ్రహానికి గురి కాకండి. తిరుమల కొండపై ఔటర్ రింగ్ రోడ్డు, కాటేజీల పేరుతో ఇప్పటికే మహా వృక్షాలను తొలగించి “కాంక్రీట్ జంగిల్” గా మార్చేశారు. తిరుమల శ్రీవారి శేషాచలం కొండల్లోని ప్రతి రాతిలో దైవ స్వరూపాన్ని శ్రీవారి భక్తులు చూస్తారు. అలాంటి సప్తగిరులలోని శ్రీవారి సంపదను, ఎర్రచందనాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత టీటీడీ అధికారులు, ధర్మకర్తల మండలిపై ఉంది.
తిరుమలకు గతంలో కూడా “రోప్ వే”, “మోనో రైలు”,”మూడవ ఘాట్ రోడ్” ప్రతిపాదనలు వచ్చినా శ్రీవారి అనుగ్రహంతో కనుమరుగై పోయాయి. టీటీడీ ధర్మకర్తల మండలి తీరు చూస్తుంటే వీవీఐపీల కోసం తిరుమల కొండపై “హెలిపాడ్” కూడా ఏర్పాటు చేస్తారా అన్న ఆందోళన భక్తులలో కలుగుతుంది. తిరుమల తిరుపతిలో గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ చూడని అకాల వర్షాల కారణంగా నగరంలోని అనేక కాలనీలు జలమయమయ్యాయి. అలా అని ఆ కాలనీలను పూర్తిగా తొలగించేస్తారా? శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యింది. అలా అని శ్రీవారి ఆలయాన్ని మరోచోటకు మార్చేస్తారా? తిరుమల ఘాట్ రోడ్ లో వర్షాలు పడినప్పుడు బండరాళ్ళు పడటం సహజం. ఐఐటీ నిపుణుల సలహాలతో “డిజాస్టర్ మేనేజ్మెంట్” వ్యవస్థను టీటీడీ ఏర్పాటు చేసి రెండు ఘాట్ రోడ్డు మార్గాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వర్షాకాలంలో బండరాళ్లు జారి రోడ్లపై పడకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తునిగా స్థానికునిగా డిమాండ్ చేస్తున్నాను
ఓం నమో వెంకటేశాయ గోవిందా 🙏
నవీన్ కుమార్ రెడ్డి
స్థానికులు
శ్రీవారి భక్తులు