రాష్ట్రంలో మహిళా భద్రతా విభాగం కార్యకలాపాలపై అడిషనల్ డీజీ శిఖా గోయెల్, డీఐజీ సుమతీలతో డీజీపీ అంజనీ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రతపై పలు వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నందుకు అభినందించారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను వెంటనే అరికట్టడానికి పోలీస్ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని చెప్పారు.
రాష్ట్రంలో ఇప్పటికే 750 పోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్ లు పని చేస్తున్నాయని, మిగిలిన అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా వీటిని ఏర్పాటు చేయనున్నట్లు అంజనీ కుమార్ వెల్లడించారు. మహిళల భద్రతపై ఇప్పటికే సంస్థాగతంగా ఉన్న మెకానిజమ్ లను ఒకే సాంకేతిక ప్లాట్ ఫారమ్ కిందకి తీసుకురావడం ద్వారా మరింత సమర్థవంతంగా నేరాలకు అరికట్టవచ్చని సూచించారు. మహిళా భద్రతా విభాగానికి అందే ఫిర్యాదుల పరిష్కారంపై పిటిషనర్ల స్పందనను తెలుసుకోవడానికి స్వతంత్రంగా పనిచేసే కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని డీజీపీ తెలిపారు.
ప్రస్తుతం 12 యూనిట్లలో భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయని, మిగిలిన జిల్లాల్లో కూడా నిర్ణీత గడువులోగా వీటిని అందుబాటులోకి తెస్తామన్నారు. 25 ట్రై కమిషనరేట్ పరిమితుల్లో గృహ హింస బాధితులకు కౌన్సెలింగ్ సేవలను చేపట్టేందుకు మహిళా సాధికారత కేంద్రం అభివృద్ధి త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిపారు. భరోసా ద్వారా లైంగిక నేరాల కేసుల విచారణను పర్యవేక్షించడం వల్ల 2022 సంవత్సరంలో 23 కేసుల్లో నేరారోపణలు నిర్ధారించడం జరిగిందని, ఇంకా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేసులను క్రమపద్ధతి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మొత్తం 30 యూనిట్లలో పనిచేసే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు హాట్ స్పాట్ లను గుర్తించడం, తిరిగి నేరాలకు పాల్పడే నేరస్థుల డేటా బేస్ ను ప్రత్యేకంగా రూపొందించాలని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా క్రమపద్ధతిలో పని చేయడం ద్వారా బహిరంగ ప్రదేశాల్లో ఈవ్ టీజింగ్ తోపాటు వివిధ రకాల వేధింపులను అరికట్టడంలో షీ టీమ్ లు ప్రధాన పాత్ర పోషించడం పట్ల డీజీపీ హర్షం వ్యక్తం చేశారు. ఫిర్యాదులను సమయానుకూలంగా పరిష్కరించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించాలన్నారు. 2022లో, షీ టీమ్ లు 6157 ఫిర్యాదులను స్వీకరించగా, వాటిలో 521 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయని, రాష్ట్రంలో 13,471 అవగాహన శిబిరాలను షీ టీమ్స్ నిర్వహించాయని తెలిపారు. మహిళలు, పిల్లలపై నేరాల నివారణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని, నేరాల నివారణపై సమర్థవంతంగా పనిచేసే అధికారులను గుర్తించి రివార్డులు ఇవ్వాలని పేర్కొన్నారు డీజీపీ అంజనీ కుమార్.