పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు డీజీపీ మహేందర్ రెడ్డి. తనను ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపిందన్న వ్యాఖ్యలను ఖండించారు. రేవంత్ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.
ఇంట్లో జారిపడడంతో ఎడమ భుజంపైన గాయమైందన్నారు డీజీపీ. ఎక్స్-రే, సీటీ స్కాన్, ఎంఆర్ఐ తీయించినట్లు వివరించారు. డాక్టర్లు భుజం కదలకుండా కట్టు కట్టారని తెలిపారు. విరిగిన బోన్ మానేందుకు పూర్తి స్థాయిలో విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో.. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4 వరకు సెలవు పెట్టినట్లు వివరించారు.
వైద్యుల సలహా మేరకు తిరిగి విధుల్లో జాయిన్ అవుతానన్నారు మహేందర్ రెడ్డి. రోజూ భుజానికి అవసరమైన వ్యాయామం, ఫిజియోథెరపీ, మందులను వాడుతున్నట్లు తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా తనను ప్రభుత్వం బలవంతంగా సెలవులో పంపించిందంటూ తప్పుడు ప్రచారం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఒక రాష్ట్ర పార్టీ నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేయడం భావ్యం కాదన్నారు.
తమ రాజకీయ అవసరాలకు ప్రభుత్వ అధికారులపై ఈవిధమైన అసత్య ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు డీజీపీ. ఒక ఉన్నత స్థాయిలో, బాధ్యతాయుత హోదాలో ఉన్న సీనియర్ అధికారిపై ఈ విధమైన ఆరోపణలు చేయడం ఆక్షేపణీయమే కాకుండా ప్రభుత్వంపై అపోహలు కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ తప్పుడు ఆరోపణలు పోలీస్ శాఖ స్థైర్యాన్ని దెబ్బతీయడంతోపాటు, ప్రజలకు నష్టం కలిగే ప్రమాదముందన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి.