తెలంగాణలో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరణి సమస్య పరిష్కరిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా సుల్తాన్ పూర్ గ్రామంలో ధరణి పై కాంగ్రెస్ పార్టీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఈ క్రమంలో గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ధరణి బాధితుల సమస్యలు తెలుసుకొని గ్రామస్తులకు హామీ కార్డులు అందజేశారు కాంగ్రెస్ నేతలు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ రైతుల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ పేదల కోసం కాదని, భూస్వాముల కోసం మాత్రమేనని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 22 లక్షల ఎకరాల భూమిని నిరుపేదలకు పంపిణీ చేసిందన్నారు. ధనవంతుల కోసమే కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. ధరణి ద్వారా 9 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో 12 వేల గ్రామాల్లో ధరణి అదాలత్ నిర్వహించి బాధితుల నుంచి దరఖాస్తు స్వీకరించి వారికి కాంగ్రెస్ గ్యారంటీ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. ధరణి పోర్టల్ ను ఫిలిపిన్స్ కు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టి వేల కోట్ల రూపాయలు కాజేస్తున్నారన్నారు.