ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల కొండపై ఉన్న ఎల్ఈడీ స్క్రీన్లలో శుక్రవారం సినిమా పాటలు ప్రసారమయ్యాయి. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. శ్రీవారి భక్తులు సహా ఏపీ విపక్ష నేతలు ఈ ఘటనపై మండిపడ్డారు. తాజాగా తిరుమలలో అసలేం జరుగుతుందంటూ సోము వీర్రాజు కూడా ఫైర్ అయ్యారు.
ఇక ఈ వివాదంపై టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి ఆదివారం స్పందించారు. బ్రాడ్ కాస్టింగ్ సిబ్బంది తప్పిదంతో ఈ ఘటన జరిగిందన్నారు. బ్రాడ్ కాస్ట్ ఉద్యోగి తన స్నేహితుడిని బ్రాడ్కాస్ట్ గదిలోకి తీసుకెళ్లాడని, ఆ తర్వాత అతడిని అక్కడే ఉంచి వేరే పనిపై వైకుంఠం-2 వరకు ఆయన వెళ్లినట్టు ఈవో తెలిపారు. ఈ క్రమంలో బ్రాడ్కాస్ట్ గదిలో ఉన్న అతడి స్నేహితుడు అక్కడ ఉన్న రిమోట్తో ఆపరేట్ చేయడంతో సినిమా పాటలు ప్రసారమైనట్టు ధర్మారెడ్డి వివరించారు.
అయితే, ఎల్ఈడీ స్క్రీన్పై సినిమా పాటలు ప్రసారం కావడాన్ని తొలుత సాంకేతిక సమస్యగా గుర్తించినట్టు చెప్పారు. ప్రాథమిక విచారణ అనంతరం బ్రాడ్కాస్టింగ్ ఉద్యోగి స్నేహితుడే ఇందుకు కారణమని తేలిందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.
తిరుమలలో శుక్రవారం సాయంత్రం డిజిటల్ స్క్రీన్పై ఆడియోలో భక్తి పాటలు వస్తే, వీడియోలో మాత్రం సినిమా పాటలు రావడం విస్మయం కలిగించింది. ఈ వేరియేషన్ చూసిన భక్తులు షాక్ అయ్యారు. దాదాపు అరంగపాటు సినిమా పాటలు ప్రసారమయ్యాయి. వీటిని గమనించిన టీటీడీ అధికారులు అప్రమత్తమైన నిలిపివేశారు.