అగ్గిపెట్టెలో చీర. దబ్బనం రంద్రంలో పట్టే చీరతో పాటు.. సుగంధాలను వెదజల్లే చీరలను నేసి మగువలను ఆకట్టుకున్న నేతన్న.. ఇప్పుడు మరో అద్భుతానికి ప్రాణం పోశాడు. దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అయోద్యలో నిర్మితం అవుతున్న భవ్యదివ్య మందిర నిర్మాణానికి ధర్మవరం నేతన్న అపురూపమైన కానుకను అందించనున్నారు. పూర్తిగా రామ నామాలతో నిండిన అరుదైన పట్టుచీరను అయోధ్య రామాలయానికి అందించనున్నారు.
ఇప్పటికే తమ పనితనంతో ఎన్నో అద్భుతాలను సృష్టించిన నేతన్నలు.. ధర్మవరం పట్టణానికి చెందిన డిజైనర్ నాగరాజు ఆధ్వర్యంలో చేనేత వైభవాన్ని మరొకసారి ప్రపంచానికి చూపించనున్నారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న పట్టు వస్త్రాన్ని రామాలయం కోసం నాలుగు నెలలపాటు కష్టపడి రూపొందించారు. శ్రీరామ నామాలతో పాటు.. రామాయణ ఘట్టాలతో 16 కిలోల బరువు ఉండే ఈ చీర.. 180 అడుగుల పొడవు ఉంటుందని నేతన్నలు చెప్తున్నారు.
సప్తవర్ణాలతో తయారైన ఈ పట్టుచీరలో 13 భాషల్లో జై శ్రీరామ్ అన్న అక్షరాలను అందంగా.. అద్భుతంగా కూర్చారు. దీంతో పాటు.. 168 రకాల రామాయణ చిత్రాలు ఉండేలా పట్టుచీరను డిజైన్ చేసారు. ఈ పట్టుచీర మొత్తం 32,200 జై శ్రీరామ్ నామాలను పొందుపరిచినట్టు నేతన్నలు స్పష్టం చేశారు. చేనేత మగ్గంపై రూపొందించిన చీర తయారీకి నాలుగు నెలల పాటు శ్రమించినట్టు వెల్లడించారు.
పట్టుచీరలకు ప్రత్యేకం అయినటువంటి ధర్మవరంలో నలుగురు నేతన్నలు నాలుగు నెలల పాటు శ్రమించి ఈ ప్రత్యేక వస్త్రాన్ని రూపొందించినట్టు నాగరాజు తెలిపారు. ఈ మేరకు దాన్ని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆవిష్కరించారు. అత్యంత త్వరలోనే పట్టు వస్త్రాన్ని అయోధ్యలోని రామ మందిరానికి బహుకరించనున్నట్టు డిజైనర్ నాగరాజు తెలిపారు.