డిజిటల్ న్యూస్ను మీడియా రిజిస్ట్రేషన్ చట్ట పరిధిలోకి తీసుకురావడానికి కేంద్ర పభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ రెగ్యులేషన్ పరిధిలో డిజిటల్ మీడియా లేదు. దీంతో నిబంధనలను ఉల్లంఘిస్తే ఇకపై డిజిటల్ న్యూస్ సైట్స్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది.
ఒకసారి ఈ సవరణ బిల్లు గనుక ఆమోదం పొందితే.. ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా వార్తలు అందించే డిజిటల్ సైట్లు చట్ట పరిధిలోకి వస్తాయి. దాంతో ఉల్లంఘనలకు పాల్పడిన వార్తా సైట్లపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియను సమాచార, ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దానిలో భాగంగా రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ బిల్లులో సవరణలు తేనుంది.
రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ బిల్కు సమాచార ప్రసార శాఖ తుది మెరుగులు దిద్దుతోంది. అందులో కొత్తగా ఏదైనా ఎలక్ట్రానిక్ డివైజ్పై డిజిటల్ మీడియా ద్వారా వార్తలు అనే అంశాన్ని కూడా చేర్చింది. ఈ బిల్లు చట్టంగా మారిన 90 రోజుల లోపు డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు తమ సైట్ రిజిస్ట్రేషన్ కోసం ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన పబ్లికేషన్లపై చర్యలు తీసుకునే అధికారం ఈ ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్కు ఉంటుంది. వాటిలో రిజిస్ట్రేషన్ను రద్దు చేయడం, పెనాల్టీ విధించడం వంటి చర్యలుంటాయి. `ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా` చైర్మన్ నేతృత్వంలో ఒక అపీలేట్ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.