– అధికార పార్టీ నేతల మధ్య వార్
– ఛైర్మన్లు, కౌన్సిలర్ల మధ్య జగడాలు
– హోరెత్తుతున్న అవిశ్వాస తీర్మానాలు
– మంత్రుల ఇలాకాల్లోనూ అదే సీన్
తెలంగాణ రాజకీయాల్లో అవిశ్వాస తీర్మానాలు కాకరేపుతున్నాయి. అధికార పార్టీ నేతల మధ్య ఉన్న కిరికిరిలను నడిరోడ్డుపైకి తీసుకొస్తున్నాయి. ఛైర్మన్లు కౌన్సిలర్లకు మధ్య ఉన్న జగడాలు అధినాయకత్వానికి తలనొప్పి తెప్పిస్తున్నాయి. ఇంతకీ వరుస పెట్టున మున్సిపల్ అవిశ్వాస తీర్మానాల వెనుకున్న కారణాలేంటీ..
ఈ మున్పిపాలటీలకు ఏమైంది.. అధికార పార్టీలో నేతల మధ్య పొసగడం లేదా.. ఛైర్మన్ల తీరు కౌన్సిలర్లకు నచ్చడం లేదా.. వరుసగా మున్సిపల్ అవిశ్వాస తీర్మానాలు ఎందుకు జరుగుతున్నాయి. ఈ మున్సిపల్ అవిశ్వాసాలే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి.అసలేం జరుగుతుందనే సందేహం కల్గక మానడం లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిదే పెద్ద చర్చనీయాంశం. ఇప్పుడు గజ్వేల్, ఎల్లారెడ్డి.. అంతకన్నా ముందు వనపర్తి, ఆపై ఆర్మూర్,జనగామ, నంది కొండ, యాదగిరి గుట్ట, చండూరు, జగిత్యాల,మేడ్చల్. మాకొద్దీ చైర్ మన్ అంటూ.. అవిశ్వాస తీర్మానాలు హోరెత్తుతున్నాయి. వీటితోపాటు భువనగిరి,ఇల్లందు,సంగారెడ్డి,సదాశివ పేట, ఆందోల్. ఆయా కలెక్టరేట్లలో కౌన్సిలర్లు.. తీర్మానాల లేఖలు అందించారు. వీటిలో మంత్రల ఇలాఖాలు సైతం ఉన్నాయి.
మంత్రులెంత ప్రాధేయ పడుతున్నా.. ఆయా మున్సిపాల్టీల కౌన్సిలర్లు.. మాకొద్దీ ఛైర్ మన్ అంటున్నారు. ఒక్కో మున్సిపాల్టీది ఒక్కో కథ. ఎందుకు ఇలా జరుగుతోంది.. మరీ ముఖ్యంగా కొందరు మహిళా ఛైర్ పర్సన్లు.. కన్నీటి పర్యంతం అయిన దృశ్యాలు.వనపర్తి వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి సొంత నియోజక వర్గం. మున్సిపల్ ఛైర్మన్ గట్టు యాదవ్, వైస్ ఛైర్మన్ వాకిటి శ్రీధర్ కు వ్యతిరేకంగా అధికార, విపక్ష కౌన్సిలర్లు ఒక్కటయ్యారు.
దీంతో ఈ వ్యవహారంలో ఆయనకు తలనొప్పిగా మారింది. మున్సిపల్ కౌన్సిలర్ల మధ్య సయోధ్య సాధించడం ఆయన బాధ్యతగా మారి తెగ ఇబ్బంది పెట్టింది. ఇకపోతే మేడ్చల్. కార్మిక మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకర్గంలోని మున్సిపాల్టీల్లో అడుగడుగునా అసంతృప్త జ్వాలలు ఎగసి పడుతున్నాయ్. ఫిర్జాదీ గూడ, జవహార్ నగర్ లో మొదలైన అసంతృప్తులు.. నేడు మేడ్చల్ మున్పిపాల్టీలోనూ ముసలం రేపింది.
మేడ్కల్ మున్పిపల్ ఛైర్ పర్సన్..మర్రి దీపికా రెడ్డిపై అవిశ్వాసం పెట్టారు 15 మంది కౌన్సిలర్లు. కొన్నాళ్లుగా దీపికా రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు వీరంతా. మంత్రుల సంగతిలా ఉంటే.. ఎమ్మెల్యేల పరిస్థితి మరోలా ఉంది. ఆర్మూర్ ఛైర్ పర్సన్ వద్దే వద్దంటూ 26 మంది కౌన్సిలర్లు నిరసన గళం విప్పారు. చైర్ పర్సన్ ను తొలగించారంటూ మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేను కలిసి తమ మనస్సులో మాట చెప్పారు.
ఎమ్మెల్యే కౌన్సిలర్లను సముదాయించినా పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులాగే ఉంది. జగిత్యాలలో అవిశ్వాసం కంటే ముందే రాజీనామా చేశారు ఛైర్ పర్సన్ భోగ శ్రావణి. అయితే ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించారు శ్రావణి. ఆమె రాజీనామాను జిల్లా కలెక్టర్ ఆమోదించారు. ప్రస్తుతం కొత్త ఛైర్ పర్సన్ కోసం అభిప్రాయ సేకరణ మొదలు పెట్టారు ఎమ్మెల్యే.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఛైర్మన్ లకు అవిశ్వాస గండం పట్టుకుంది. యాదగిరి గుట్ట, చండూరు మున్సిపాలిటీల్లో వివిధ పార్టీల కౌన్సిలర్లు ఆయా జిల్లాల కలెక్టర్లను కలిసి అవిశ్వాసం పెట్టాలని కోరారు. ఇదే అదనుగా మరి కొన్నింటిలోనూ అసంతృప్తులు అవిశ్వాసం దిశగా పావులు కదుపుతున్నారు.