తెలంగాణలో రాజకీయాలు నిప్పులు రాజుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు మాటల బాణాలు విసురుకుంటున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విరుచుకుపడ్డారు. ఇటీవల అసెంబ్లీ లో రక్షణ శాఖ ఆధీనంలో ఉండే కంటోన్మెంట్ బోర్డుపై కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు.
అసలు రక్షణశాఖ ప్రాంతంలో విద్యుత్, నీటి సరఫరా బంద్ చేయడానికి ఆ ప్రాంతం కల్వకుంట్ల జాగీరా అని ఆమె ధ్వజమెత్తారు. మంత్రి కేటీఆర్ సాక్షాత్తు అసెంబ్లీలో రక్షణ శాఖ అధికారులను హెచ్చరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. అసలు కల్వకుంట్ల కుటుంబ సభ్యులపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
భారత్ చైనా సరిహద్దు ప్రాంతం నుంచి దేశ సైనికులు తోక ముడుచుకొని వచ్చారని విమర్శించారు. రక్షణ శాఖను గతంలో సీఎం కేసీఆర్హేళన చేయడం, కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత కశ్మీర్ భారతదేశంలో భాగం కాదని దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం వెనుక ఆంతర్యమేంటని ఆమె ప్రశ్నించారు.
దేశ సరిహద్దులో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడుతున్న సైనికులకు మద్దతుగా నిలవడం మరిచి.. వారిపై అవాకులు చవాకులు పేలడం కల్వకుంట్ల కుటుంబ అహంకారానికి నిదర్శనమని విరుచుకుపడ్డారు. ఇలాంటి దేశ వ్యతిరేకులు దేశాన్ని విడిచి వెళ్లిపోతే భరతమాతకు భారం తగ్గుతుందని డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు.