పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంతటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ నటించిన ఖుషీ సినిమా సంచలనం సృష్టించింది. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించిన ముంతాజ్.. కోలీవుడ్ హీరోయిన్ గా తెలుగులో పలు సినిమాల్లో ఐటెం సాంగ్ చేసి మెప్పించిన ఈ బ్యూటీ.. అత్తారింటికి దారేది చిత్రంలో ‘ఓరి దేవుడా దేవుడా’ సాంగ్ లో మరోసారి పవన్ సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనసును దోచేసింది.
అయితే.. తాజాగా ఈ హీరోయిన్ పై గృహహింస కేసు నమోదు కావడం ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ముంతాజ్ ప్రస్తుతం చెన్నైలోని అన్నానగర్ లో నివసిస్తోంది. ఆమె ఇంట్లో గత కొన్నేళ్లుగా ఉత్తరాది రాష్ట్రానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు పనిచేస్తున్నారు. వారిలో ఒక బాలిక ఇటీవలే అన్నానగర్ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ముంతాజ్ పై ఫిర్యాదు చేసింది.
ముంతాజ్ తమను వేధిస్తోందని, తమకు తమ సొంత ఊరు వెళ్లిపోవాలని ఉందని చెప్పినప్పటికీ పంపడం లేదని ఆమె ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తమను రోజూ చిత్ర హింసలు పెడుతున్నట్టు బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు.
సదరు బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముంతాజ్ ఇంటికి వెళ్లి బాలికలను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ కేసులో ముంతాజ్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కోలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఈ విషయమై ముంతాజ్ మాత్రం ఏం స్పందించడంలేదు.