రాచకొండ పోలీస్ కమిషనర్ గా దేవేంద్ర సింగ్ చౌహాన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పోలీస్ సిబ్బంది అభినందనలు తెలిపారు. రాచకొండ కమిషనరేట్ ఏర్పాటు నుంచి సుదీర్ఘకాలం కమిషనర్ గా కొనసాగిన మహేశ్ భగవత్ సీఐడీ అదనపు డీజీగా బదిలీ అయ్యారు.
దీంతో ఆయన స్థానంలో డీఎస్ చౌహాన్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1997 వ బ్యాచ్ కు చెందిన చౌహాన్ గతంలో ఎక్సైజ్, కేంద్ర సంస్థలతో పాటు పలు జిల్లాల్లో పని చేశారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన చౌహాన్ ఎంటెక్ పూర్తి చేశారు. 2016 నుంచి సుదీర్ఘ కాలంగా రాచకొండ పోలీస్ కమిషనర్ గా మహేశ్ భగవత్ బాధ్యతలు నిర్వర్తించారు.
తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఒక పోలీస్ కమిషనరేట్ కు వరుసగా ఆరేళ్ల కంటే ఎక్కువ కాలం పోలీస్ కమిషనర్ గా పని చేసి మహేశ్ భగవత్ రికార్డు సృష్టించారు. 1995వ బ్యాచ్ కు చెందిన ఆయన మహిళల అక్రమ రవాణాను అరి కట్టడానికి తీసుకున్న చర్యలకు గాను అమెరికా ప్రభుత్వం 2017 లో హీరో అవార్డుతో సత్కరించింది.
అయితే సైబరాబాద్ లో పెరిగిన నేరాలతో పాటు సైబర్ నేరాలకు కళ్లెం వేయడానికి మహేశ్ భగవత్ ఎంతో కృషి చేశారు. దీంతో పాటు ఆయన పలు సేవా కార్యక్రమాలను కూడా చేసి మంచి మన్నలను పొందారు. ఇతరులకు సాయం చేయాలంటే మంచి మనసు ఉండాలని.. జీవితంలో స్థిర పడిన ప్రతి ఒక్కరూ పేదలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.