ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 20న ఈడీ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. గురువారం ఉదయం 11 గంటలకు కవిత ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. పలు కారణాలతో ఆమె వెళ్లలేదు. తన తరఫన బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, లాయర్ భరత్ ను ఈడీ కార్యాలయానికి పంపారు.
తాను విచారణకు రాలేనని ఈడీకి లేఖ పంపారు కవిత. ఆ లేఖను పరిశీలించిన అధికారులు ఈనెల 20న తమ ముందు హాజరు కావాల్సిందిగా మరోమారు నోటీసులు జారీ చేశారు.
మరోవైపు ఇదే కేసులో అరెస్ట్ అయిన.. రామచంద్ర పిళ్లై కస్టడీ ముగిసింది. దీంతో ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. ఈ సందర్భంగా కస్టడీ పొడిగించాలని కోరుతూ.. కవిత అంశాన్ని ప్రస్తావించారు. ఆమెతోపాటు పిళ్లైని విచారించాల్సి ఉందని తెలిపింది ఈడీ.
ఈడీ వాదన తర్వాత కవిత విచారణకు రాలేదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. దానికి రాలేదని సమాధానం చెప్పింది ఈడీ. ఆమె రానందు వల్లే పిళ్లై కస్టడీ పొడించాలని కోరింది ఈడీ. ఇటు 20న విచారణకు రావాలని కవితకు నోటీసులు పంపారు అధికారులు. ఈలోపు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అనేది ఇంట్రస్టింగ్ గా మారింది.