– 9న విచారణ ఉంటుందన్న ఈడీ
– పిళ్లైతో కలిసి విచారించేందుకు సిద్ధం
– 10న ఢిల్లీలో కవిత ధర్నా
– ఈడీ ముందు హాజరు అవుతారా? పోస్ట్ పోన్ చేయమంటారా?
– 7 రోజుల పాటు ఈడీ కస్టడీలోనే అరుణ్ పిళ్లై
– సీబీఐ-ఈడీ పోటాపోటీ అరెస్టులు, విచారణలు
– లిక్కర్ స్కాంలో డే వన్ నుంచి ఫుల్ డీటెయిల్స్
– తొలివెలుగు ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్
క్రైంబ్యూరో, తొలివెలుగు:మహిళా దినోత్సవం నాడు సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఈడీ షాకిచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి గురువారం ఢిల్లీకి రావాలని కోరుతూ ఆమెకు సమన్లు పంపింది. తాను కవిత బినామీనే అని ఈ కేసులో నిందితుడు, బిజినెస్ మన్ అరుణ్ రామచంద్ర పిళ్లై అంగీకరించారని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. కవిత పేరును కూడా చేర్చింది. అయితే.. మహిళా రిజర్వేషన్లపై 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని కవిత ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముందురోజున విచారణకు రావాలని ఈడీ.. ఆమెకు నోటీసులు పంపడం హాట్ టాపిక్ గా మారింది.
అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ తరుఫున పిళ్లై భాగస్వాములకు 32.5 శాతం ఉండగా అందుకు సంబందించిన రూ.3.40 కోట్ల పెట్టుబడిలో కవిత కోటి రూపాయలు సమకూర్చారని తెలిపారు. ఇందులో రూ.100 కోట్లు విజయ్ నాయర్ కి అడ్వాన్స్ ఇచ్చారని గుర్తించారు. మొత్తం రూ.3,500 కోట్ల బిజినెస్ లో 12 శాతం అంటే రూ.420 కోట్ల అక్రమార్జన ఉంటుందని లెక్కలు వేసుకుని.. అందులో నుంచి 6 శాతం రూ.210 కోట్లు ఆప్ పార్టీకి అందించాలని కుట్ర చేసినట్లు అభియోగాలు మోపారు. ఈ వ్యవహారంలో మొత్తం రూ.296 కోట్లు ముందస్తుగా చేతులు మారినట్లు చెబుతున్నారు అధికారులు.
కంపెనీల వ్యవహారం!
ఇండో స్పిరిట్స్ కంపెనీలో షేర్ హోల్డర్ గా ఉంటూ సౌత్ గ్రూప్ సభ్యులకు మధ్య వారధిగా పని చేశారు అరుణ్ పిళ్లై. ఢిల్లీలోని గౌరి అపార్ట్ మెంట్స్ లో 2021 మే లో మీటింగ్స్ కి అభిషేక్, బుచ్చిబాబు, పిళ్లై రాగా ఆమ్ ఆద్మీ తరుఫున విజయ్ నాయర్ హాజరయ్యారు. జూన్ లో వీరు సమీర్ మహేంద్ర, శరత్ చంద్రారెడ్డి మీటింగ్ పెట్టించారు. స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ లో 2021 సెప్టెంబర్ లో తాజ్ మాన్ సింగ్ హోటల్ లో మీటింగ్ జరిగింది. బినయ్ బాబు, మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి స్కాం గురించి చర్చించుకున్నారు. హైదరాబాద్ లో ఐటీసీ కోహినూర్ లో మరిన్ని మీటింగులు జరిగాయని ఈడీ గుర్తించింది.
డే వన్ నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందంటే?
– 2020 సెప్టెంబర్ నుంచి మే 2021 వరకు ఢిల్లీ మద్యం పాలసీ కొత్త విధానం తయారు.. ఎక్సైజ్ కమిషనర్ రవి ధావన్ తో కమిటీ.. తర్వాత కేబినేట్ సమావేశాలు.. పాలసీ విధానం తయారు.. మంత్రివర్గం ఆమోదం వంటివి జరిగాయి.
– 2021 నవంబర్ 8న లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా లిక్కర్ పాలసీ విధానంపై మొదటిసారిగా ఆరోపణలు చేశారు.
– 2022 జులై 20న కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లిక్కర్ పాలసీపై లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ రాశారు.
– జులై 22న సీబీఐకి లేఖ రాశారు ఎల్జీ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరారు.
– ఆగస్ట్ 17న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 15 మంది పేర్లను నిందితులుగా చేర్చింది. ఈడీ ఒక్కరోజు వ్యవధిలోనే కేసును టేక్ ఓవర్ చేసుకుంది.
– సెప్టెంబర్ 5, 6, 7 తేదీల్లో హైదరాబాద్ లోని 6 ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిగాయి.
– సెప్టెంబర్ 17, 18 తేదీల్లో ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఆఫీస్ లో సోదాలు చేశారు అధికారులు.
– సెప్టెంబర్ 21న అరబిందో ఫార్మా అధినేత శరత్ చంద్రారెడ్డిని విచారించింది ఈడీ.
– అక్టోబర్ 7, 8 తేదీల్లో హైదరాబాద్ మీడియా సంస్థల్లో సోదాలు జరిగాయి.
– అక్టోబర్ 10న బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అరెస్ట్ చేసింది.
– అక్టోబర్ 12న ఆంధ్రప్రభ ఎండీ ముత్తా గౌతమ్ అరెస్ట్ అయ్యారు.
– అక్టోబర్ 17న ఢిల్లీ డిప్యూటీ సీఏం సిసోడియాను ప్రశ్నించింది సీబీఐ.
– నవంబర్ 10న శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేసింది ఈడీ.
– నవంబర్ 14న అప్ కి చెందిన విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లిని సీబీఐ కేసులో బెయిల్ రాగానే ఈడీ అరెస్ట్ చేసింది.
– నవంబర్ 16న దినేష్ అరోరా అప్రూవర్ గా మారడానికి రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతి.
– నవంబర్ 25న 10 వేల పేజీలతో సీబీఐ తొలి చార్జీషీట్.
– నవంబర్ 26న ఈడీ మొదటి చార్జీషీట్ దాఖలు.
– నవంబర్ 29న అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసింది. అదేరోజు కవిత పేరును రిమాండ్ రిపోర్టులో 25 సార్లు ప్రస్తావించింది. 10 సెల్ ఫోన్స్ వాడారని ధ్వంసం చేశారని కోర్టుకు నివేదించింది.
– డిసెంబర్ 6న కవితకు సీబీఐ నోటీసులు.
– డిసెంబర్ 11న కవితను విచారించింది సీబీఐ. సీఆర్పీసీ 191 కింద నోటీసులు జారీ.
– 2023 జనవరి 6న ఈడీ రెండో చార్జీషీట్ దాఖలు చేసింది. ఇందులో సీఎం కేజ్రీవాల్.. సమీర్ మహేంద్రతో మాట్లాడినట్లు ఆధారాలతో సహా ప్రస్తావించింది.
– నెల రోజులు 118 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన డేటాను ఎనలైజ్ చేసుకున్నాక ఈ విషయాన్ని బయటపెట్టింది.
– ఫిబ్రవరి 8న కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది.
– ఫిబ్రవరి 18న సిసోడియాకు సీబీఐ నోటీసులు
– ఫిబ్రవరి 25న సమీర్ మహేంద్ర, విజయ్ నాయర్, దినేష్ అరోరా, అమిత్ అరోరా, అరుణ్ రామచంద్ర పిళ్లై ఆస్తులను జప్తు చేసింది ఈడీ.
– ఫిబ్రవరి 26న 8 గంటల పాటు మనీష్ సిసోడియాను విచారించి సాయంత్రం అరెస్ట్ చేసింది సీబీఐ.
– మార్చి 7న అరుణ్ రామచంద్ర ఫిళ్లైని ఈడీ అరెస్ట్ చేసింది. 7 రోజుల కస్టడీ విధించింది కోర్టు. రిమాండ్ రిపోర్ట్ లో పిళ్లై.. కవిత బినామీయే అని పేర్కొంది ఈడీ.
– మార్చి 8న కవితకు ఈడీ నోటీస్ పంపంది. 9 తేదీన విచారణకు రావాలని ఆదేశించింది.