తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు పున:ప్రారంభించాలా..? వద్దా..? అన్న విషయంపై సంధిగ్ధత కొనసాగుతోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జనవరి 30 వరకు సెలవులు పొడిగించింది. మరో మూడు రోజుల్లో ఆ గడువు ముగుస్తుండటంతో దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు నిలకడగా ఉండడం.. విద్యా సంస్థల ప్రారంభంపై వివిధ వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా తుది నిర్ణయం తీసుకోవాలని సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ఈ నెల 8వ తేదీ నుంచే ప్రకటించింది. 16వ తేదీ వరకు ఆ సెలవులు ముగిశాయి. ఆ తర్వాత కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని 30వ తేదీ వరకు సెలవులను పొడిగించారు అధికారులు. ప్రస్తుతం 8, 9, 10వ తరగతుల విద్యార్థులతో పాటు.. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ నెల 30 తర్వాత సెలవును పొడిగిస్తారా..? లేక విద్యాసంస్థలను తెరుస్తారా..? అన్న అంశంపై విద్యార్థులు.. వారి తల్లిదండ్రుల్లో ఆసక్తి నెలకొంది.
మరోవైపు పాఠశాలలను తెరవాలని ప్రైవేట్ యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. రెండేళ్ల నుంచి స్కూళ్లు సరిగ్గా నడవకపోవడంతో విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా జరుగుతుండడం.. ప్రస్తుత కరోనా వేరియంట్ అంత ప్రమాదకరంగా లేకపోవడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని విద్యా సంస్థలను తెరవాలని కోరుతున్నారు.
ఈ ఏడాది వార్షిక పరీక్షలను ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఇంటర్, పదో తరగతి పరీక్షల ఫీజుల షెడ్యూల్ ను ప్రకటించారు. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయా కోర్సుల్లో ప్రవేశాల కోసం వివిధ సెట్లను నిర్వహించాల్సి ఉంది. అయితే.. ఇవన్నీ సవ్యంగా జరగాలంటే.. ముందు ఈ ఏడాదికి సంబంధించిన విద్యా బోధన పూర్తి చేయాల్సి ఉంటోంది. ఇందుకోసం ప్రత్యక్ష తరగతులను తప్పనిసరిగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని 31 నుంచి రాష్ట్రంలో విద్యా సంస్థలను తిరిగి తెరవడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు అన్ని విద్యాలయాలు ఒకేసారి తెరవకుండా దశలవారీగా తెరిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.