సెల్ఫోన్ పేలి చిన్నారి మృతిచెందిన విషాదకర సంఘటన కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి త్రిస్సూర్లోని తిరువిల్వామలలో ఈదుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
చార్జింగ్ పెట్టి గేమ్ ఆడుతుండగా స్మార్ట్ ఫోన్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. ఈ ఘటనలో పత్తిపరంబుకు చెందిన ఆదిత్యశ్రీ అనే 8 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు.
గ్యాప్ లేకుండా గేమ్స్ ఆడుతుండటంతో ఫోన్ హీటెక్కినట్లు పేర్కొంటున్నారు. ఎండాకాలం కావడంతో హీట్ పెరిగి ఫోన్ పేలింది. చిన్నారి ఆదిత్యశ్రీ మృతితో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
విగత జీవిగా మారిన చిన్నారిని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో జరిగిందని పోలీసులు తెలిపారు.
ఆదిత్యశ్రీ తిరువిల్వామలలోని క్రైస్ట్ న్యూ లైఫ్ స్కూల్లో 3వ తరగతి చదువుతోంది. ఈ ఘటనపై పజ్యన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం ఫోరెన్సిక్ తనిఖీలు నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు.