2023 ఏడాదికి గానూ తెలంగాణ రాష్ట్రంలో తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే గతేడాదికి ఈ సంవత్సరానికి ఓటర్ల జాబితాలో చాలా తేడా ఉంది. దాదాపు నాలుగు లక్షల ఓటర్లను అధికారులు తొలగించారు. ఈసీ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మొత్తం 2,99,92,941 ఓటర్లున్నారు.
ఇందులో 1,50,48,250 పురుష ఓటర్లు ఉండగా, 1,49, 24,718 మహిళా ఓటర్లు ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్ల వయస్సు మధ్య 2,78,650 మంది ఓటర్లన్నారు. అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 6,44,072 మంది ఓటర్లు ఉన్నట్టుగా ఈసీ తెలిపింది.
అత్యల్పంగా భద్రాచలంలో 1,42,813 మంది ఓటర్ల ఉన్నారని పేర్కొంది. ప్రతి ఏడాది ఓటర్ల జాబితా సవరణ తరువాత ఓటర్ల తుది జాబితాను జనవరి నెలలో ఈసీ ప్రకటిస్తుంది. అందులో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గురువారం ఓటర్ల జాబితాను విడుదల చేశారు.
అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో ఈసీ లెక్కల ప్రకారం 3,99,84,868 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,02,19,104 మంది మహిళా ఓటర్లు, 2,01,32,271 పురుష ఓటర్లున్నారు. రాష్ట్రంలో సర్వీసు ఓటర్లు 68,182 మంది ఉన్నట్లుగా ఈసీ తెలిపింది.