బిలినీయర్ ఎలన్ మస్క్ ట్విట్టర్ సంస్థను కొనుగోలు చేయాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దాదాపు 44 బిలియన్ల డాలర్లకు దాన్ని ఆయన సొంతం చేసుకోవాలనుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన ఆ డీల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ట్విటర్ తో జరిగిన అగ్రిమెంట్ సరైన రీతిలో లేదని ఆయన ఆరోపించారు. అందుకే ఆయన దీని నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. గత ఏప్రిల్ లో ట్విటర్ ను కొనుగోలు చేస్తున్నట్లు మస్క్ వెల్లడించిన విషయం తెలిసిందే. కానీ అప్పటి నుంచి ఆ భారీ ఒప్పందంపై రకరకాల అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
స్పామ్, ఫేక్ అకౌంట్లపై సమగ్రమైన సమాచారాన్ని ట్విటర్ ఇవ్వలేకపోయిందని, అందుకే ఆ ఒప్పందం నుంచి వైదొలుతుగున్నట్లు మస్క్ తెలిపారు. అయితే మస్క్ నిర్ణయంపై ట్విటర్ స్పందించింది. మస్క్పై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. మస్క్ అంగీకరించిన ధరకు, షరతులకు లోబడే కట్టుబడి ఉన్నామని ట్విటర్ బోర్డ్ చైర్మెన్ బ్రెట్ టేలర్ తెలిపారు.
ట్విటర్ను కొనేందుకు ఏప్రిల్లో ఓకే చెప్పినా, మే నెలలో ఆ డీల్పై మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫేక్ అకౌంట్ల నేపథ్యంలో ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. మొత్తం యూజర్లలో ఫేక్ లేదా స్పామ్ యూజర్లు కేవలం 5 శాతం లోపు మాత్రమే ఉన్నారన్న విషయాన్ని నిరూపించాలని మస్క్ కండీషన్ పెట్టారు. అయితే ట్విటర్ సంస్థ ఆ సమాచారాన్ని ఇవ్వడంలో విఫలమైనట్లు ఆయన తెలిపారు. బిలియన్ డాలర్ బ్రేకప్ ఫీజు కోసం కోర్టులో కేసు దాఖలు చేయనున్నట్లు ట్విటర్ వెల్లడించింది.