తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీల కోసం ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది కోరుతున్నారు. ఉద్యోగుల కోరికను మన్నించిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్ విడుదల చేసి బదిలీ కోరుతున్న ఉద్యోగుల వివరాలు సేకరించాయి.
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు 1338 మంది ఉద్యోగులు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు 1804 మంది ఉద్యోగులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ వివరాలతో జిఏడి రాష్ట్ర పునర్విభజన శాఖ ప్రతిపాదన రూపొందించి ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపడం జరిగింది. ఈనేపద్యంలో ముఖ్యమంత్రి ఉద్యోగులు ఇరు రాష్ట్రాల మధ్య బదిలీల ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.
తదుపరి ఈ ప్రతిపాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరిస్తే అప్పుడు బదిలీలకు సంబంధించిన విధివిధానాలు రూపొందించి బదిలీల ప్రక్రియ చేపడుతారు. అలాగే తెలంగాణకు బదిలీ కోరుకునే వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇపుడు ఎన్ ఒ సి ఇస్తుంది.
అలాగే త్వరలో చేపట్టబోయే ఉపాధ్యాయ బదిలీలలో తప్పనిసరి బదిలీకి ఎనిమిది సంవత్సరాల సర్వీసును పరిగణలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి ని కోరడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.