టాలీవుడ్ సీనియర్ నటి వాణి విశ్వనాథ్.. మరోసారి రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వక తప్పడం లేదని వెల్లడించారు వాణి. తాను చిత్తూరు జిల్లా నగరి నుంచే ఎన్నికల బరిలో దిగనున్నట్టు ప్రకటించారు. ఏ పార్టీ నుంచి తాను పోటీ చేస్తానన్నదానిపై స్పష్టత లేకపోయినప్పటికీ.. నగరి నుంచి బరిలో దిగుతానని అభిమానులకు తేల్చి చెప్పేశారు.
నగిరిలో వేలాదిమంది అభిమానులు, అధిక సంఖ్యలో మహిళల ఆదరణ తనకుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయంగా తన అభిమానులకు జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేక పోతున్నానని పేర్కొంది వాణి. నగరి 1వ వార్డులోని శ్యామలమ్మ గుడి వద్ద స్థానిక మహిళలతో కలిసి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరితో తన కుటుంబానికి ఎనలేని అనుబంధం ఉందన్నారు. ఇక్కడే తన అమ్మమ్మ నర్సుగా పని చేసిందని వాణి గుర్తు చేసుకున్నారు. తమిళ సంస్కృతి ఉన్న నగరి నుంచి తాను ఎన్నికల్లో పోటీకి సిద్దం అవుతున్నట్టు వెల్లడించారు.
తనకు ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ కైనా సిద్ధమైనట్టు తెలిపారు. అయితే. ఇప్పటికే నటి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నుంచే వాణి విశ్వనాథ్ కూడా పోటీలో ఉండనున్నట్టు ప్రకటించడంతో.. రానున్న ఎన్నికల్లో నగరి రాజకీయానికి మరింత సినీ గ్లామర్ పెరుగుతోందనే చర్చ నడుస్తోంది.