మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ఎస్సారెస్పీ కాలువకు గండిపండిది. బురహాన్ పురం గ్రామం వద్ద కాలువకు బుంగ పడింది. దీంతో నీరు భారీగా వృధాగా పోతుంది.
ఇక పంటనీరంతా పొలాల్లోకి పోతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో భారీగా నీరు చేరడంతో ఎలా సాగు చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. అయితే పై నుంచి కాలువ లోకి నీరు వదిలినప్పుడల్లా ఇదే పరిస్థితి అని రైతులు చెబుతున్నారు. దీంతో ప్రతి సారీ పంట పొలాలు నాశనం అవుతున్నాయని.. కొన్ని సార్లు అయితే చేతికొచ్చిన పంట నీళ్ళలో కొట్టుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత మూడు నాలుగు ఏళ్లుగా ఎస్సారెస్పీలోకి నీరు వదిలితే తమ పొలాల్లోకి నీరు వస్తోందంటున్నారు. అయితే ఎస్సారెస్పీ కాలువ పనులు నాసిరకంగా చేయడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని సమస్యను తీర్చాలని వేడుకుంటున్నారు.