టీ కాంగ్రెస్ సీనియర్ నేత బక్క జడ్సస్ సంచలన ఆరోపణలు చేశారు. టీఎస్పీఎస్సీ లో అక్రమాల వెనుక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని అన్నారు. తాజాగా వెలుగు చూసిన టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలతో పాటు 2016 గ్రూప్ 1 పరీక్షలో కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగిందని వీటిలో కవిత పాత్ర ఉందని ఆయన ఆరోపించారు.
దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో జడ్సన్ ఫిర్యాదు చేశారు. కల్వకుంట్ల కవిత జోక్యం చేసుకోవడంతో గతంలో అర్హత లేని వారికి గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చాయని దీనిపై విచారణ చేపట్టాలన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో ఈడీ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుందని కవిత సుప్రీం కోర్టుకు వెళ్లిందని.. అందువల్ల కవితను బహిరంగంగా విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా ఈడీని కోరారు.
ఢిల్లీలో ఉన్న ప్రగతి మైదానంలో గానీ లేదా హైదరాబాద్ లో ఉన్న ఎల్బీ స్టేడియం, జింఖానా గ్రౌండ్, పరేడ్ గ్రౌండ్ లో ఎక్కడైనా లైవ్ టెలికాస్ట్ పెట్టి కవితను ప్రశ్నించాలన్నారు. అలాగే ఈ కేసులో మిగతా నిందితులతో కవిత కలిసి ఉన్నప్పటి ఫోటోలు, ఈడీ వద్ద ఉన్న ఆధారాలను దేశ ప్రజలకు చూపించాలన్నారు.
ఈ కేసు నుంచి కవితను తప్పించడానికి కొందరు బీజేపీలో ఉన్న నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ తో పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశంలో బీఆర్ఎస్, బీజేపీ పరస్పరం డ్రామాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ, బీఆర్ఎస్ దొంగాట ఆడుతున్నారని ఒకరు కొట్టినట్లు చేస్తే మరొకరు ఏడ్చినట్లు చేస్తున్నారని మండిపడ్డారు.