ఏపీలో పోలీసుల జులుం రాజ్యమేలుతుందని మండిపడ్డ చంద్రబాబు నాయుడు సజ్జలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పోలీసుల దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తలను పరామర్శించిన బాబు..అంతా సజ్జల డైరెక్షన్లోనే జరిగిందని ఫైర్ అయ్యారు.
అయితే నిన్న పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పలువురు తెదేపా కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన చంద్రబాబు.. పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కార్యకర్తలు త్వరగా కోలుకోవాలని.. అక్రమ కేసులపై న్యాయబద్ధంగా పోరాడుదామని వారికి ధైర్యం చెప్పారు.
అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ”ప్రజల్లో వ్యతిరేకత గమనించే వైకాపా ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. నిన్న అనపర్తిలో పోలీసులను పురిగొల్పి పంపారు. ముందురోజు సభ నిర్వహణకు అనుమతి ఇచ్చి… అప్పటికప్పుడు అనుమతి లేదంటూ అరాచకం సృష్టించారు. జగ్గంపేట, పెద్దాపురంలో లేని ఆంక్షలు అనపర్తిలో ఎందుకొచ్చాయి. ప్రతిపక్షాలు నిర్వహించే సభలను అడ్డుకుంటున్నారు.’అని విరుచుకుపడ్డారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. చట్టవ్యతిరేకంగా పనిచేయాలని పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లోనే కొంతమంది పోలీసులు అరాచకం సృష్టిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు బాబు.
పోలీసులు కావాలనే తెదేపా కార్యకర్తలపై గురిపెట్టి దాడి చేశారన్నారు. కార్యకర్త ప్రకాశ్నాయుడిని గుండెలపై కొట్టడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పోలీసులు సహకరించొద్దని కోరుతున్నానని.. చట్టానికి అనుగుణంగా విధులు నిర్వర్తించాలంటూ.. చంద్రబాబు పోలీసులకు సూచించారు.