గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో మాజీ సీఎం చంద్రబాబు జాతీయ జండా ఆవిష్కరించారు. 74వ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ విరుద్ధ, ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనతో రాష్ట్ర భవిష్యత్ ప్రమాదంలో పడిందని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం నాటి స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిగా నేడు రాష్ట్రంలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం మంచిది అయినా దాన్ని అమలు పరిచేవాళ్లు మంచివాళ్లు కాకపోతే ఫలితం ఉండదన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోలేకపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రమాదంలో పడుతుందని అన్నారు.
యువతకు అవకాశాలు కల్పించేలా ప్రభుత్వాలు పాలసీలు తీసుకువచ్చి వాటిని అమలు చేయాలన్నారు. ప్రపంచాన్ని జయించే శక్తిగా భారత్ మారుతుందన్నారు. ఇప్పుడే ‘విజన్-2047’ సిద్ధం చేసుకుని.. ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లడం ద్వారా.. దేశం 100 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ ఉత్సవాలు జరుపుకునే 2047 నాటికి భారత్ ప్రపంచంలోని అగ్రదేశాల్లో 1 లేదా 2వ స్థానాలకు చేరుతుందని పేర్కొన్నారు.
ఐటీ, నాలెడ్జ్ ఎకానమీ వంటి విభాగాల్లో ఇప్పటికే ప్రపంచంలో ఉన్నతస్థాయికి భారతీయులు చేరుకున్నారు. అమెరికన్ల తలసరి ఆదాయం 65 వేల డాలర్లు కాగా.. ఇండియన్స్ తలసరి ఆదాయం 1,19,000 డాలర్లుగా ఉండడం మన దేశ పౌరుల సమర్థతకు నిదర్శనమన్నారు. గ్లోబల్ గవర్నెన్స్ లో భారతీయులు మరింతగా రాణించే అవకాశాలు ఉన్నాయి.
పేదరికం, అసమానతలు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరు కంకణబద్ధులై పని చేయాల్సి ఉందని అన్నారు. నేషన్ ఫస్ట్ అనే సిద్దాంతంలో పౌరులు, ప్రభుత్వాలు పని చేయాలని అన్నారు. యువశక్తిని సక్రమంగా వినియోగించుకుంటే ప్రపంచంలో అత్యున్నత స్థాయికి భారత్ చేరుకోవడం తథ్యమని అన్నారు. ‘విజన్-2047’తో ప్రణాళికా బద్దంగా ప్రయాణం సాగించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.