ప్రీతి మృతిపై ప్రభుత్వం స్పందించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటన చేశారు. ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. ప్రీతి ఘటన అత్యంత దురదృష్టకరం, బాధాకరమని చెప్పారు.
ఎవరూ పూడ్చలేని దుఖంలో బాధిత కుటుంబం ఉందని.. విచారం వ్యక్తం చేశారు ఎర్రబెల్లి. సీఎం కేసీఆర్ విషయం తెలిసి తీవ్ర ఆవేదన, విచారం వ్యక్తం చేశారని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు.
ప్రీతి ఘటనపై విచారణ కొనసాగుతుందన్నారు ఎర్రబెల్లి. ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. విచారణలో తేలిన దోషులు ఎంతటి వారైనా సరే చట్ట ప్రకారంగా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ప్రీతి ఆత్మ శాంతించాలని ఆ దేవుడిని ప్రార్థించారు మంత్రి. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు.
ప్రీతి సరిగ్గా ఆదివారం రాత్రి 9.10 గంటలకు కన్నుమూసింది. ఈ మేరకు నిమ్స్ డాక్టర్లు ప్రకటన చేశారు. బ్రెయిన్ డెడ్ తో మృతి చెందినట్లుగా నిర్ధారించారు.