అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమార్జనే ధ్యేయంగా భారీగా ఆస్తులు కూడబెట్టిన అధికారులు, రాజకీయనేతలు ఎంతోమంది ఉన్నారు. చిన్న చిన్న అధికారుల దగ్గర నుంచి బడా రాజకీయ నేతల వరకు ఎంతో మంది ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జార్ఖండ్ విద్యాశాఖ మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు తిర్కీకి మూడేళ్ల జైలు శిక్ష, మూడు లక్షలు జరిమానా విధించింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.
2005-2009 మధ్యకాలంలో మధు కోడా ప్రభుత్వంలో మందార్ ఎమ్మెల్యే ఎన్నికైనా బంధు తిర్కీ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో రూ.6.28లక్షలు ఆదాయానికి మించి సంపాదించినట్లు సీబీఐ విచారణలో తేలింది. ఇక ప్రత్యేక సీబీఐ కోర్టులో ప్రాసిక్యూషన్ తరఫున 21 మంది సాక్షులు, డిఫెన్స్ తరఫున ఎనిమిది సాక్షులను హాజరుపరిచారు. దీనిపై సోమవారం తిర్కీకి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, మూడు లక్షల జరిమానా విధించింది.
సామాజిక కార్యకర్త రాజీవ్ శర్మ 2009లో దిగువ కోర్టులో తిర్కీపై ఫిర్యాదు చేయగా.. ట్రయల్స్ కోర్టు జూలై 1,2009న విచారణకు ఆదేశించింది. 1 ఆగస్టు 2010లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బంధు తిర్కీపై కేసు నమోదు చేసింది సీబీఐ. కోర్టు ఆదేశాలపై 62 ఏళ్ల మందార్ ఎమ్మెల్యేను ప్రశ్నించగా.. “నేను కోర్టును విశ్వసిస్తున్నాను.. నేను నా లాయర్తో మాట్లాడతాను” అని పేర్కొన్నారు.
కాగా, ఇదే కేసులో 2018లో రాంచీ జిల్లాలోని బన్హోరాలో బంధు తిర్కీని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆయనకు బెయిల్ లభించింది. ఇక, ఎన్నికల అఫిడవిట్లో బంధుత్ తిర్కీ తన ఆస్తులను రూ.60,000 నగదు, కారు చూపించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్లు నివేదికలు తెలిపాయి. అయితే ఆయన మంత్రిగా ఉన్న సమయంలో న్యూఢిల్లీలోని వసంత్ విహార్లో రూ.8 కోట్ల విలువైన ఫ్లాట్ను కొనుగోలు చేశారు. మరోవైపు, జార్ఖండ్ నేతకు వివాదాలు కొత్తేమీ కాదు.. ఇప్పటికే పలు కుంభకోణాలు వెలుగుచూశాయి.