ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మంచి వేడి మీద ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని కోటం రెడ్డి ఆరోపించగా.. దీని పై మాజీ మంత్రి, రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసులు రెడ్డి స్పందించారు. కోటం రెడ్డి విడుదల చేసిన ఆడియో పై బాలినేని గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మీకు పార్టీలో ఉండటం ఇష్టం లేకపోతే మీరు టీడీపీలోనికి వెళ్లిపోవచ్చు.
మంత్రి పదవి కోసం, స్పీకర్ పదవి కోసమో ఇలా అసంతృప్తిని వ్యక్తం చేయడం సరికాదు. మీకంటే ఎంతమంది సీనియర్లు నెల్లూరులో లేరు. ఇలా అయితే నల్లాపురెడ్డి ఏమనుకోవాలంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి టీడీపీలోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆనంకు భద్రత తగ్గించారని ఆనడంలో వాస్తవం లేదు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఉన్న గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు కూడా ఆనంకు ఇచ్చినట్టే భద్రత కల్పించారు. కోటంరెడ్డి విడుదల చేసిన ఆడియో ఖచ్చితంగా కాల్ రికార్డే. టాపింగ్ ఎంత మాత్రం కాదు. కాల్ రికార్డు అని నేను నిరూపిస్తా.. కోటంరెడ్డి పోటీ నుంచి తప్పుకుంటాడా… అని సవాల్ చేశారు.
ఒకవేళ టాపింగని రుజువైతే నేను కూడా పోటీ నుంచి తప్పుకుంటా… నా సవాల్ ని స్వీకరిస్తావా… అని ప్రశ్నించారు.
కోటంరెడ్డి స్నేహితుడే ఆ కాల్ రికార్డ్ ని ఇచ్చాడు. కోటంరెడ్డి స్నేహితుడిని మీడియా ముందు ప్రవేశపెడతాం. ఏది నిజమో ఏది అబద్దమో తేలిపోతుందన్నారు…
ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆడియో రికార్డును చూపించి బెదిరించలేదని, ఆ ఆడియో రికార్డు ద్వారా ఎందుకు ఇలా చేశావని అధిష్టానం కోటంరెడ్డిని ప్రశ్నించిందన్నార. కోటం రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తారా లేదా అన్నది అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. 35 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు, ఇద్దరు మంత్రులు తమ ఫోన్లు కూడా టాపింగ్ అవుతున్నాయని కోటంరెడ్డిని ఫోన్లో సంప్రదించారనడంలో వాస్తవం లేదని బాలినేని తెలిపారు.