రైతు ఉద్యమానికి రాష్ట్రంలో మద్ధతిచ్చిన సీఎం, ఢిల్లీ వెళ్లాక రైతు ఉద్యమ నాయకులను ఎందుకు కలవలేదో కేసీఆర్ కే తెలియాలంటూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ఢిల్లీలో ఏం జరిగిందో కేసీఆర్ కే తెలియాలన్నారు. గతంలో ఇందిరాగాంధీ హాయంలో బలమైన నాయకులు ఢిల్లీ వెళ్తే బలహీనంగా మారిపోయేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.
రైతు ఉద్యమాన్ని కేంద్ర పెద్దలు అవహేళన చేయటం బాధాకరమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు రైతు సమస్యలు పట్టడంలేదని విమర్శించారు. కొత్త చట్టాలతో కౌలు రైతులే ఎక్కువగా నష్టపోతున్నారన్నారు. రైతు చట్టాలపై కేంద్రం చెప్పే దానిలో ఒక్క శాతం కూడా నిజం లేదన్నారు. రైతులను సంప్రదించాకనే చట్టాలు తీసుకొచ్చామని కేంద్రమంత్రులు అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. అంబానీ, అదానీల కోసమే కొత్త రైతు చట్టాలు అని ఆరోపించారు. రైతుల పట్ల కేంద్రం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. మోడీతో పోల్చితే కాంగ్రెస్ ప్రభుత్వమే మేలుగా వ్యవహరించిందని వడ్డే శోభనాద్రీశ్వరరావు చెప్పుకొచ్చారు.