తెలంగాణ రాష్ట్రంలో జరిగే స్కామ్ లు, ప్రజల సమస్యలు, ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ పార్టీ పెట్టారని విమర్శించారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు. ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తన పరివారం కోసమే బీఆర్ఎస్ పెట్టారని తీవ్రంగా ఆరోపించారు. అబ్ కీ బార్ బీ మేరా పరివార్ కా సర్కార్ కావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని తెలిపారు.
తెలంగాణలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా మారిందని, అత్యాచారాలు, కిడ్నాప్ లు పెరుగుతున్నాయని మండిపడ్డారు. టీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇస్తారనే భయంతోనే బీఆర్ఎస్ తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు రామచంద్రరావు. కేసీఆర్ కలలు కలలుగానే మిగిలిపోతాయన్నారు. బీఆర్ఎస్ ఎన్నటికీ జాతీయపార్టీ గుర్తింపు పొందదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రైతులు బీజేపీ వెంట ఉన్నారన్న ఆయన.. రైతు సమస్యలను బీజేపీ పరిష్కరిస్తుందని అన్నారు. ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా మారేకన్నా ముందే టీఆర్ఎస్ అవినీతి జాతీయ స్థాయికి చేరిపోయిందని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందలేవన్న ఆయన… ఆప్ కు జాతీయ పార్టీగా గుర్తింపు రావడానికి 12 ఏండ్లు పట్టిందన్నారు.
కుటుంబ ఆకాంక్షలు నెరవేర్చేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టారన్నారు. కేంద్ర పథకాలు ప్రజలకు చేరకుండా చేస్తున్న కేసీఆర్.. రాష్ట్రంలో ఏ గుణాత్మక మార్పు వచ్చిందో చెప్పాలని నిలదీశారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు.