బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి. ఈ సందర్భంగా ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గిరిజనులకు భూములు ఇస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ఇచ్చిన భూములను లాగేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, రైతులకు బేడీలు వేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
ప్రజా రక్షకులుగా ఉండాల్సిన పోలీసులు భక్షకులుగా మారారని మండిపడ్డారు. అర్థరాత్రి సమయంలో ఇళ్లల్లోకి వెళ్లి కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేయాల్సిన అవసరమేంటని రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఖమ్మం జిల్లాలో అడుగు పెట్టకముందే మీడియాకు క్షమాపణ చెప్పాలన్నారు. సర్పంచుల మీద కేసీఆర్కు కనీసం జాలి కూడా లేదన్నారు. అన్నింటిపై రేట్లు పెంచి సామాన్యుడిపై భారం మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఖమ్మం కాంగ్రెస్ జిల్లా.. రాబోయే ఎన్నికల్లో 10 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ నో వేకెన్సీ, ఆల్రెడీ రిజర్వ్ డ్ ఫర్ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. బీజేపీ ఇచ్చే మిరపకాయకో, కేసీఆర్ ఇచ్చే సొరకాయకో ప్రజలు ఆశపడటం లేదని విమర్శించారు రేణుక చౌదరి.