హైదరాబాద్ నగరంలో తక్కువ ధరకే ప్రయాణసేవలు అందించే ఎంఎంటీఎస్ సర్వీసుల రద్దు కొనసాగుతోంది. ఈ నెల 23 వరకూ 38 సర్వీసులను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే సోమవారం కూడా 36 సర్వీసులను నిలిపేసినట్లు ప్రకటించింది. ఇందులో హైదరాబాద్-లింగంపల్లి మధ్య నడిచే 18, ఫలక్నుమా-లింగంపల్లి మధ్య నడిచే 16, సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య నడిచే రెండు ఎంఎంటీఎస్లు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
సేవల్లో అంతరాయం కేవలం ఒక్క రోజు మాత్రమే ఉంటుందని తెలిపారు. మంగళవారం నుంచి అన్ని సర్వీసులు యథాతథంగా నడుస్తాయని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. నగరంలో సామాన్యులకు అందుబాటులో తక్కువ ధరలకే ప్రయాణసేవలు అందిస్తున్న ఎంఎంటీఎస్ సర్వీస్ లు నిలిపివేయడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాంకేతిక కారణాలు, ట్రాక్ మరమ్మతుల కారణంగానే సర్వీసులు రద్దు చేశామని అధికారులు చెప్తున్నారు. ప్రయాణికులకు జరుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ సర్వీసులే కాకుండా విశాఖపట్నం-నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ రైలును సైతం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాలను కలుపుతూ ఉన్న ఎంఎంటీఎస్ సర్వీసులు భాగ్యనగర వాసులకు ఎంతో సేవలందిస్తున్నాయి. ఈ సేవలకు అంతరాయం ఏర్పడడంతో ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశముంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణించడంతో.. కేసులు సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.