సోషల్ మీడియా లో కరోనా పై రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి.కొంతమంది ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారు. అలాంటి ఒక వార్త ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఒక వ్యక్తి తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఈ వార్త చూడండి.
ఒక చర్చి, మసీదు, ఇస్లాం యూనివర్సిటీ తిరుపతి లో వీటిలో ఏ ఒక్కటీ ఐసోలేషన్ వార్డులుగా చేయలేదు. కానీ మహోన్నతమైన కాణిపాకం వినాయక స్వామి దేవాలయాన్ని చేసింది ఈ ప్రభుత్వం. అది కూడా వాళ్ళ మతం కోసం డిల్లీ పోయొచ్చిన సాయుబుల కోసం చూడండి వాళ్ళు గుడిలోకి చెప్పులేసుకుని దేవస్థానం లోకి పోతున్నారు కనీస జ్ఞానం లేకుండా…’ అని చెబుతూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
కాణిపాకం వినాయక స్వామి దేవాలయాన్ని కరోనా ఐసోలేషన్ వార్డులుగా మార్చారు అన్నది ఆ ప్రచారం.
ఇందులో నిజమెంత
వీడియోలో కనిపిస్తున్నది కాణిపాకం వినాయక స్వామి దేవాలయం కాదు. అది కాణిపాకంలో ఉన్న ‘శ్రీ గణేష్ సదన్’ అనే నివాస కేంద్రం. ఆ నివాస కేంద్రాన్ని క్వారంటైన్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగిస్తుంది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్టులోని వీడియోని సరిగ్గా గమనిస్తే, దాంట్లో ఒక బోర్డు మీద ‘శ్రీ గణేష్ సదన్’ అని రాసి ఉన్నట్టు మనం గమనించవచ్చు. ఒక్కసారి మీరు గూగుల్ లో ‘శ్రీ గణేష్ సదన్ కాణిపాకం’ అని వెతకండి.‘శ్రీ గణేష్ సదన్’ అనే నివాస కేంద్రం కాణిపాకంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ నివాస కేంద్రం ఫోటోలను చూడగా, వీడియోలో చూపెట్టిన బిల్డింగ్ ని చూడవొచ్చు. పోస్టులో చెప్పినట్టు అది దేవాలయం కాదు. అది నివాస కేంద్రం. కాబట్టి గూగుల్ లో ఉన్న ఫోటోలలో కూడా ప్రజలు చెప్పులు వేసుకొని ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
కాణిపాకం లోని ‘శ్రీ గణేష్ సదన్’ నివాస కేంద్రాన్ని క్వారంటైన్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగిస్తున్నట్టు వివిధ దినపత్రికలలో వచ్చిన ఆర్టికల్ ను కూడా మనం చూడొచ్చు.
సో, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఈ వార్త ఫేక్.అది కాణిపాకం ఆలయం కాదు. కాణిపాకం లో ఉన్న గణేష్ సదన్ అనే నివాస కేంద్రం.