ఫేక్ సీబీఐ అధికారి శ్రీనివాసరావు నాలుగు రోజుల కస్టడీ ముగిసింది. దీంతో సీబీఐ అధికారులు నిందితుడిని ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. నిందితుడి నుంచి ఎలాంటి నిజాలు రాబట్టలేక పోయామని 1100 కాల్ రికార్డ్స్ పరిశీలించినట్లు తెలిపారు. నిందితుడిని విచారించేందుకు మరింత సమయం కావాలని కోరారు. దాదాపు గంటన్నర పాటు కోర్టులో విచారణ కొనసాగింది. అయితే కోర్టు పోలీస్ కస్టడీని తిరస్కరించింది. శ్రీనివాస్కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ కోర్టు విధించింది. అంటే ఈనెల 16వ తేదీ వరకు శ్రీనివాస్ జైలులో ఉండనున్నాడు. సీబీఐ, ఈడీ కేసుల నుంచి తప్పిస్తానంటూ పలువురి నుంచి డబ్బులు వసూలు చేశారనే అభియోగాలను ఫేక్ సీబీఐ అధికారి శ్రీనివాస రావు ఎదుర్కొంటున్నారు.
ఈ కేసులో చాలా పెద్ద స్థానాలలో ఉన్న వారిని, బడా లీడర్లను శ్రీనివాసరావుతో కలిపి విచారించాలని సీబీఐ కోర్టుకు తెలిపింది. శ్రీనివాసరావుతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్రను డిసెంబరు 1న దాదాపు 8 గంటల పాటు సీబీఐ ప్రశ్నించింది. ఫేక్ సీబీఐ ఆఫీసర్ శ్రీనివాస్ కేసులో మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిసెంబరు 1వ తేదీన సీబీఐ విచారణకు హాజరయ్యారు. సాక్షులుగా హాజరైన వీళ్లిద్దరినీ ఉదయం 11 గంటల నుంచి దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు అధికారులు విచారించారు. ఒక ఐపీఎస్, ఇద్దరు సీఐలతో కూడిన సీబీఐ బృందం వారిపై ప్రశ్నల వర్షం కురిపించింది. వీళ్లిద్దరినీ వేర్వేరుగా, నిందితుడితో కలిపి విచారించి స్టేట్ మెంట్లు రికార్డు చేసింది.
ముఖ్యంగా శ్రీనివాస్ తో ఉన్న సంబంధం ఏంటి? ఎప్పటి నుంచి పరిచయం ఉంది? ఎప్పుడెప్పుడు కలిశారు? ఏం మాట్లాడుకున్నారు? అతనికి ఏమైనా డబ్బులిచ్చారా? అని ఆరా తీసినట్లు తెలిసింది. శ్రీనివాస్ ఫోన్ లో దొరికిన ఫొటోలు, కాంటాక్ట్ నెంబర్ల గురించి అడిగినట్లు తెలుస్తోంది. ఇటీవల మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో శ్రీనివాస్ ను ఎందుకు సన్మానించారని ప్రశ్నించింది సీబీఐ. అయితే శ్రీనివాస్ తమకు కేవలం మున్నురు కాపు బిడ్డగా, ఐపీఎస్ అధికారిగా మాత్రమే తెలుసునని మంత్రి గంగుల తెలిపారు. ఆయన దగ్గరున్న గోల్డ్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వెల్లడించారు.
కాగా నకిలీ సీబీఐ ఆఫీసర్ శ్రీనివాస్ రావు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. ఫేక్ ఆఫీసర్ శ్రీనివాస్ ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్ లను అడ్డాగా చేసుకొని సెటిల్మెంట్లు చేయించాడు. ఐదు సంవత్సరాలుగా శ్రీనివాస్ ఢిల్లీలో మకాం వేశాడు. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాల రాజకీయ నాయకులతో శ్రీనివాస్ టచ్ లో ఉన్నాడు. ఢిల్లీలో పనులు చక్కబెట్టి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. శ్రీనివాస్ పై ఇప్పటికే పలు కేసులు నమోదు అయ్యాయి. ఐపీసీ 419, 420 కింద కేసులు నమోదయ్యాయి. సీబీఐ సీనియర్ ఆఫీసర్ నంటూ చెప్పి ప్రైవేటు సెటిల్మెంట్లు చేసినట్టు సీబీఐ విచారణలో తేలింది.
శ్రీనివాస్ రావు విశాఖ జిల్లా చిన్నవాల్తేర్ కిర్లంపూడికి చెందినవాడు. ప్రస్తుతం సీబీఐ అదుపులో ఉన్న శ్రీనివాస్.. బెయిల్ పిటిషన్ వేయాలని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో విశాఖకు చెందిన ఆయన స్నేహితులు ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్ కి వచ్చారు. శ్రీనివాస్ వైజాగ్ లోని సీబీఐ టౌన్లో చాలా రోజులు రైస్ బిజినెస్ చేశాడు. అందుకే ఆయనను అందరూ సీబీఐ శ్రీనివాస్ అని పిలిచేవారు. పది రూపాయల వడ్డీకి వ్యాపారం చేసేవాడు. ఏడాదిన్నర కాలంగా వైజాగ్, ఢిల్లీ, హైదరాబాద్ లో తిరుగుతున్నాడు అని వాళ్లు చెప్పారు. అయితే శ్రీనివాస్ కు ఇంగ్లీషులో తన పేరు కూడా రాయడం తెలీదన్నారు. కానీ హిందీలో మాత్రం అనర్గళంగా మాట్లాడతాడని వారు తెలిపారు. అయితే గతంలో తమను వద్దిరాజు రవిచంద్ర దగ్గర దావత్ రి రమ్మని పిలిచాడని, కానీ తాము వెళ్లలేదని శ్రీనివాస్ రావు స్నేహితులు వెల్లడించారు. వీరు చెప్పిన విషయాలతో మరిన్ని విషయలు బయటకు వచ్చే అవకాశం ఉంది.