మంచిర్యాల జిల్లాలో మందు, మాంసంతో పదో తరగతి విద్యార్ధులు ఫేర్వెల్ పార్టీ చేసుకోవడం సంచలనంగా మారింది. ప్రభుత్వ బీసీ హాస్టల్లోకి బీరు బాటిల్స్ రావడం, పదో తరగతి విద్యార్ధులతో పాటు.. ఇతర కింది తరగతుల విద్యార్ధులు సైతం బీర్లు తాగడం వైరల్ గా మారింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ విద్యార్ధులు.. ఫేర్ వెల్ పార్టీలో భాగంగా చికెన్ వండించారు వార్డెన్. వంట మనిషి వంట విజయ వంట చేసి వెళ్లి పడుకుంది.
వార్డెన్ కూడా రాత్రి తొమ్మిదిన్నర వరకు ఉండి ఇంటికి వెళ్లాడు. దానికి తోడు వాచ్మెన్ కూడా లేడు. దీంతో పదో తరగతి చదువుతున్న కొందరు హాస్టల్ విద్యార్ధులు.. బయటి విద్యార్ధులతో బీర్ బాటిల్స్ తెప్పించుకున్నారు. అందరూ పడుకున్న తరువాత మందు, మాంసంతో పార్టీ చేసుకున్నారు. పదో తరగతి విద్యార్ధులు బీర్లు తాగడం, అందుకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే విచారణ చేయాలంటూ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ కు దేశాలు జారీ చేశారు. దర్యాప్తులో విద్యార్ధులు మద్యం సేవించింది నిజమేనని అధికారులు తేల్చి చెప్పారు.
అయితే.. పదో తరగతి అయిపోతోంది పార్టీ చేసుకుంటాం అనగానే.. తన సొంత డబ్బులతో చికెన్ తీసుకొచ్చి వండించాడు హాస్టల్ వార్డెన్ మల్లేష్. అందరూ తినే సమయంలో కాకుండా.. ప్రత్యేకంగా వారి గదిలోకి చికెన్ తీసుకెళ్లారు కొందరు విద్యార్ధులు. ఎలాగూ తిని పడుకుంటారు కదా అని రాత్రి తొమ్మిదిన్నరకు వార్డెన్ కూడా వెళ్లిపోయాడు. వార్డెన్, వంటమనిషి విజయ వెళ్లిపోయిన తరువాత బయటి స్టూడెంట్స్ సహాయంతో బీర్ బాటిల్స్ హాస్టల్ లోనికి రావడంతో.. చికెన్ ను స్టఫ్గా పెట్టుకుని మద్యం లాగించారు.
వారు బీర్లు తాగింది నిజమేనని ఒప్పుకోవడంతో.. వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. విద్యార్ధుల తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించామని చెప్తున్నారు. ఈ ఘటనలో హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కనబడుతోందని.. అయనపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. విద్యార్ధులు క్రమశిక్షణ తప్పి ప్రవర్తిస్తున్నారని.. అందుకు అధికారుల నిర్లక్షమే కారణం అని ఆరోపిస్తున్నారు చుట్టుపక్కల ప్రజలు. విద్యార్ధులను అదుపు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా అధికారులెవరూ పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. ఇప్పటికైన ప్రత్యేక శ్రద్ద సారించాలని చెప్తున్నారు.