జగిత్యాల టౌన్ మాస్టర్ ప్లాన్ పై ఆందోళనలు రోజురోజుకి తీవ్రతరమవుతున్నాయి. వెంటనే మాస్టర్ ప్లాన్ ని రద్దు చేయాలని నర్సింగాపూర్ మహిళా రైతులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ఇంటి ముందు నిరసనకు దిగారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మా భూములను తీసుకోవద్దని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారికి అండగా ఉంటానని… ఒక్క గుంట భూమిని కూడా ఎక్కడికి పోనిచ్చేది లేదని రైతులకు హామీ ఇచ్చారు. రైతుల భూములను మాస్టర్ ప్లాన్ నుంచి తొలగిస్తామని చెప్పారు.
మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ సోమవారం జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామ పాలకవర్గం రాజీనామా చేసింది. తిమ్మాపూర్ సర్పంచ్ మెరుగు రమ్య (కాంగ్రెస్), ఉప సర్పంచ్ ఏలేటి మోహన్ రెడ్డి(బీఆర్ఎస్) తో సహా ఎనిమిది మంది వార్డు మెంబర్ల రాజీనామాలు చేశారు.
మరోవైపు వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ(AMC) డైరెక్టర్ దుమాల రాజేష్ కూడా రాజీనామా చేశారు. నూతన మాస్టర్ ప్లాన్లో జగిత్యాల చుట్టు పక్కల గ్రామాలతో పాటు వ్యవసాయ భూములను కలుపుతూ అధికారులు పబ్లిక్ జోన్, సెమీ పబ్లిక్ జోన్లుగా ముసాయిదా రూపొందించిన విషయం తెలిసిందే.