రైతులతో కలిసి పొలంలో కూర్చొని వినూత్నంగా నిరసన చేపట్టారు చొప్పదండి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మేడిపల్లి సత్యం. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి పంట పొలాలకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. రెండు నెలలుగా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా అధికారుల్లో చలనం లేదన్నారు.
అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో రిజర్వాయర్ కింద వందలాది ఎకరాల వరి పంట ఎండిపోతుందన్నారు. యాసంగి సాగు ప్రారంభానికి ముందే రిజర్వాయర్ గండి పూడ్చివేత పనులు చేపట్టాలని డిమాండ్ చేసినా అధికార యంత్రాంగం పట్టించుకోలేదన్నారు.
ఇప్పటికే వేలాది రూపాయలు అప్పులు తీసుకొచ్చి రైతులు వరి పంట సాగు చేస్తే అధికారులు సకాలంలో సాగునీరు విడుదల చేయకపోవడంతో పంట ఎండిపోతుందన్నారు. అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి పంటలకు నష్టం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో సాగునీరు విడుదల చేయకపోతే వందలాది మంది రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, కాంగ్రెస్ మండల కిసాన్ అధ్యక్షులు బూర్గు గంగయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు తోట కరుణాకర్, జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, కోల ప్రభాకర్, పెద్దిల్లి రాజేశం గ్రామ రైతులు పాల్గొన్నారు.