ఆరుగాలం కష్ట పడి పండించిన ధాన్యానికి రకరకాల కారణాలు చెప్తూ.. మిల్లర్లు అరకొర రేటు కడుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు చేసే వారు లేక వరి ధాన్యం రైతులు మిల్లుల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైస్ మిల్లులకు ప్రసిద్ధి. వరి ధాన్యాన్న కొంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. మిల్లర్లు గిట్టుబాటు ధర కల్పించడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు.
రోజుల తరబడి మిల్లుల వద్ద పడిగాపులు కాయలేక మిల్లర్లు అడిగిన ధరకే ధాన్యాన్ని అమ్మే పరిస్థితి ఏర్పడిందని రైతులు గోడెళ్లబోసుకుంటున్నారు. యాసంగిలో దొడ్డు రకం బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేయమని చెప్పడంతో సన్న రకం బియ్యాన్ని పండించడానికే ఎక్కువ మొగ్గు చూపామంటున్నారు.
ప్రభుత్వం 1,960 రూపాయలు మద్దతు ధర ప్రకటించినా.. తమ చేతికి మాత్రం 1800 కూడా రావడం లేదంటున్నారు రైతులు. మిల్లర్లు సిండికేట్గా మారి నాణ్యత చూడకుండానే ధాన్యానికి ధర కడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వారం క్రితం క్వింటాకు రూ. 2100 వరకూ చెల్లించిన మిల్లర్లు కోతలు పెంచి రూ. 300 తగ్గించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1850, 1830 ధరకే కొనుగోలు చేస్తుండటంతో.. పెట్టుబడి కూడా రావడం లేదని అన్నదాతలు గోడెళ్లబోసుకుంటున్నారు.
మిల్లర్లను మద్దతు ధర అడిగితే.. ధాన్యంలో నల్ల మచ్చ ఉందని, బెరుకులు, తాలు ఎక్కువగా ఉన్నాయని సాకులు చెప్తున్నారని అంటున్నారు. నిత్యావసర ధరలు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ.. పండించిన పంటకు మాత్రం ధర పెరగడం లేదంటున్నారు. ఒక్కొక్కరికీ ఒక్కోలా ధర ఇస్తూ మిల్లర్లు మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతన్నలు. మిల్లర్ల దోపిడీని అరికట్టేలా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.