మానసిక పరిస్థితి సరిగా లేని కూతురును 36 సంవత్సరాలుగా గొలుసులతో బందించి ఉంచాడు ఓ తండ్రి. కొద్ది రోజుల కిందట ఆ తండ్రి చనిపోవడంతో బందిగా ఉన్న ఆమెను ఓ స్వచ్ఛంధ సంస్థ బయటకు తీసుకొని వచ్చింది. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.
ఫిరోజాబాద్ తుండ్లా ప్రాంతంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన సప్నా జైన్ (53)కు మానసికస్థితి సరిగ్గా ఉండేది కాదు. ఆ కారణంతో సప్నా తండ్రి 36 ఏళ్ల కిందట ఆమెను గదిలోకి తీసుకెళ్లి.. గొలుసుతో కట్టేసి బంధించాడు. అప్పుడు సప్నా వయస్సు 17 ఏళ్లు. అప్పటి నుంచి గదిలో ఉన్న సప్నాకు ఆమె కుటుంబ సభ్యులు తలుపు కింద నుంచి భోజనం పంపించేవారు.
ఆ గదిలోనే సప్నా.. మల మూత్ర విసర్జన కూడా చేసేది. కిటికీలో నుంచి నీళ్లు పోస్తూ ఆమెకు స్నానం చేయించేవారు. అలా ఆమె 36 ఏళ్లుగా గది దాటి బయటకు రాలేదు.సప్నా తండ్రి గిరీష్ చంద్ కొద్ది నెలల క్రితం చనిపోయాడు. తాజాగా సప్నా గురించి తెలుసుకున్న స్థానిక స్వచ్ఛంద సేవా భారతి సభ్యులు ఆమె ఇంటికి వెళ్లారు.
బాధితురాలి పరిస్థితిని చూసి చలించిపోయారు. వెంటనే ఆమెను బయటకు తీసుకొచ్చి స్నానం చేయించారు. కొత్త బట్టలు అందించారు. తర్వాత సప్నా గురించి ఆగ్రా మాజీ మేయర్, హత్రాస్క్ చెందిన స్థానిక భాజపా ఎమ్మెల్యే అంజులా మహౌర్కు చెప్పారు. వారు అధికారులతో కలసి వచ్చి సప్నాను విడిపించారు. వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.