గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పై కేసు నమోదైంది. ఆయనతోపాటు మరో ఐదుగురిపై కాపీ రైట్ చట్టం ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు ముంబై పోలీసులు. కోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఏక్ హసీనా థీ.. ఏక్ దీవానా థా అనే సినిమాను అనుమతి లేకుండా యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడమే ఈ వివాదానికి కారణం. దీనిపై ఆ సినిమా దర్శక నిర్మాత సునీల్ దర్శన్ కోర్టును ఆశ్రయించారు. గూగుల్ సీఈఓతో పాటు అందుకు బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తాను ఆ సినిమా రైట్స్ ను ఎవరికీ అమ్మలేదన్న సునీల్ దర్శనం.. యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడం వల్ల తనకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. యూట్యూబ్ నిర్వాహకులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన స్పందించలేదని చెప్పారు. అందుకే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు.
ఏక్ హసీనా థీ.. ఏక్ దీవానా థా మూవీ 2017లో రిలీజ్ అయింది. పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. కోర్టు ఆదేశాల మేరకు ముంబై పోలీసులు సుందర్ పిచాయ్ తో పాటు మరో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాపీ రైట్ యాక్ట్ 1957లోని 51, 63, 69 సెక్షన్ల కింద కేసు బుక్ చేసినట్లు సమాచారం.