ముంబై బాంద్రా ప్రాంతంలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ నివాసం ‘మన్నత్’కు అత్యంత సమీపంలో ఈ భవనం ఉంది. దట్టమైన పొగ అలుముకోవడంతో, మన్నత్ లో జనాలంతా బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో షారూక్ ఇంట్లోనే ఉన్నాడు.
‘జివేష్ బిల్డింగ్’లో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 21అంతస్తుల భవనంలో.. 14వ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. లెవల్-2 ఫైర్ యాక్సిడెంట్గా గుర్తించిన అధికారులు.. 8 అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపు చేశారు. ఘటనాస్థలం వద్ద జంబో ట్యాంకర్లు, అంబులెన్స్ల్ని సిద్ధంగా ఉంచి, సత్వరమే చర్యలు తీసుకున్నారు.
ఈ ప్రమాదం నుంచి ఆరుగురు వ్యక్తుల్ని, ఓ పెంపుడు కుక్కను కాపాడారు పోలీసులు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేక ఇంట్లోనే అగ్నిప్రమాదం జరిగిందా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగితే మాత్రం సదరు భవనం నిర్మించిన బిల్డర్ పై కఠిన చర్యలకు సిద్ధమౌతోంది ముంబయి మహానగర పాలక సంస్థ.
జరిగిన ఘటనపై షారూక్ స్పందించాడు. ‘ఇంట్లో మంటలు చెలరేగాయి. ఎలా జరిగిందో తెలియదు. అయితే ఇంట్లో అంతా సేఫే. అన్ని డిపార్టుమెంట్స్ వెంటనే స్పందించినందుకు థాంక్స్’ అంటూ షారుక్ ఖాన్ శుక్రవారం తెల్లవారు ఝామున ట్విట్టర్లో ట్వీట్ చేశారు. షారుక్ ఖాన్ ఈ విషయం గురించి ట్విట్టర్లో పేర్కొనడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.