హైదరాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతుండడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గురువారం సికింద్రాబాద్ స్వప్నలోక్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన ఘటన మరువక ముందే మరొకటి జరగడంతో నగర వాసులు కలవర పడుతున్నారు.
తాజాగా రాజేంద్రనగర్ శాస్త్రీపూరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్లాస్టిక్ గోదామ్లో పెద్ద ఎత్తున్న మంటలు ఎగిసిపడుతున్నాయి. గోదామ్లో నిలిపివుంచిన రెండు డీసీఎం వాహనాలు దగ్ధం అయ్యాయి. దీంతో మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించింది. గాటైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని 10 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువస్తోన్నారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగినట్లు సమాచారం.
అయితే.. అగ్నిప్రమాదం జరిగిన గోదాం పక్కనే ఉన్న స్కూల్ను అధికారులు ఖాళీ చేయించారు. పాఠశాలలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సెంటర్ ఉండటంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. పరీక్ష రాసే విద్యార్థులను స్థానిక ఫంక్షన్ హాల్ లేదా స్థానిక మరో పాఠశాలలో పరీక్ష రాసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తామంటున్నారు. అధికారులు ఇస్తున్న సమాచారం క్లారిటీ లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన గురవుతున్నారు.
నాలుగు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగిన జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే..గుట్టలు గుట్టలుగా పడి ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు జీహెచ్ఎంసి అధికారులపై మండిపడుతున్నారు.