కరోనా మహమ్మారి అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకుంటున్న భారతదేశ అసలు విషయాన్ని ఎత్తి చూపింది. వైద్యంలో భారత దేశం ఎంత వెనకబడి ఉందో అన్న అంశం ఒక్కటే కాదు… కనీసం సెల్ సిగ్నల్స్ కూడా రాని అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆన్లైన్ పాఠాలు అందుకోవడానికి చిన్నారులు పడుతున్న కష్టాలకు అద్దం పట్టే సంఘటన ఇది.
ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలము మొర్రిగూడలోని గిరిజన కుటుంబానికి చెందిన సరస్వతికి చదువులంటే ఎంతో ఇష్టం. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా పాపను చదివించాలన్న ఉద్దేశంతో పేరెంట్స్ మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చేర్పించారు. తను ఇప్పుడు ఒకటో తరగతి చదువుతోంది. కానీ, కరోనా వల్ల పాఠశాలలు ఏడాది కాలంగా మూతపడటంతో దీంతో టీచర్లు కొంత కాలంగా ఆన్లైన్లో పాఠాలు బోధిస్తున్నారు. అయితే… పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన మొర్రిగూడలో ఏ మొబైల్ నెట్వర్క్ సిగ్నల్స్ అందవు. దీంతో సరస్వతి విద్య తండ్రి కుడిమెత భగవంతరావు రోజూ తన ఊరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో.. సిగ్నల్ వచ్చే ప్రాంతానికి తన కుమార్తెను బైక్పై తీసుకెళ్తున్నాడు. తరగతులు పూర్తైన తర్వాత తిరిగి ఇంటికి తీసుకొస్తున్నాడు.
రహదారి పక్కన ఓ కల్వర్టు మీద చెట్టు నీడలో కూర్చొని తండ్రి మొబైల్ ఫోన్లో ఆన్లైన్ పాఠాలను చిన్నారి సరస్వతి వింటుంది. రోజు ఈ చిన్నారిని తండ్రి బైక్ మీద సిగ్నల్ వచ్చే ప్రాంతానికి తీసుకెళ్లి క్లాసులు వినిపిస్తున్నట్లు తల్లి తెలిపింది. ఇలాంటి ఇబ్బందులు పడుతున్న చిన్నారులు ఎందరో ఉన్నారు. తల్లిదండ్రులకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చే స్థోమత లేక అనేక మంది చిన్నారులు ఆన్లైన్ పాఠాలకు దూరంగా ఉంటున్నారు. చిన్నారి సరస్వతి చదువు పై చూపెడుతున్న శ్రద్ద కు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లోని ఓ ప్రయివేట్ పాఠశాల నిర్వాహకులు పదవ తరగతి వరకు ఉచితంగా బోధించేందుకు ముందుకు వచ్చారు.
ఇది వెలుగులోకి వచ్చిన ఒక్క సంఘటనే. కానీ బయటకు రాని ఎంతో మంది విద్యార్థులు ఆన్ లైన్ చదువుల కోసం పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.