దేవసేనతో జాతిరత్నం జతకట్టింది. అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యూవీక్రియేషన్స్ బ్యానర్ లో పి.మహేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. రాబోయే రోజుల్లో ఇది నవ్వుల చట్టి(పాల కుండ) కాబోతుందని టైటిలే చెబుతుంది.
ఉగాది పండగ సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. రధన్ సంగీత అందించిన ఈ గీతాన్ని అనంత్ శ్రీరామ్ రాయగా.. ఎమ్ఎమ్ మానసి ఆలపించారు.
‘పుత్తడి బొమ్మ కోవెల కొమ్మ.. పెద్ద అడుగే వేసిందే.. పద్ధతులన్నీ సంకెళ్ళని తెంచుకుంటూ నడిచిందే.. సన్నాయే వద్దంటా.. మంత్రాలొద్దంటా.. పేరంటాలే పడదంటా..’ అంటూ సాగే ఈ గీతం హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ను తెలియజేసేలా ఉంది.స్నేహం, మోహం, బంధం, అనుబంధం ఏవీ వద్దనుకునేలాంటి పాత్రలో అనుష్కశెట్టి నటిస్తోందని ఈ పాట చూస్తే అర్థం అవుతోంది.
అటు రధన్ అందించిన ట్యూన్ కూడా వినగానే ఆకట్టుకునేలా చాలా క్యాచీగా ఉంది. ఆ ట్యూన్ అంతే అందంగా పాడింది ఎమ్ఎమ్ మానసి. పాటను బట్టి చూస్తే హీరోయిన్ పై సాగే మాంటేజ్ సాంగ్ అని తెలుస్తోంది.
ఇక ఈ వేసవి బరిలో తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో విడుదల కాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్ ను ఈ పాట ఓ కొత్త ఊపుతో మొదలుపెట్టింది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ప్రమోషన్స్ లో దూకుడు పెంచబోతున్నారు.
భాగమతి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత యూవీ క్రియేషన్స్ లో అనుష్క శెట్టి నటించిన సినిమాగానూ.. చాలా గ్యాప్ తర్వాత స్వీటీ నటించిన చిత్రం కావడంతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిపై మంచి అంచనాలే ఉన్నాయి.