ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఐదురాష్ట్రాల ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్పోల్స్ అంచనాలకు మించి నరేంద్ర మోడీ-అమిత్షా ద్వయం ప్రభంజనాన్ని సృష్టించింది.. పంజాబ్ మినహా నాలుగు రాష్ట్రాల్లో విజయాన్ని సాధించింది. పంజాబ్లో ఆమ్ఆద్మీ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. అక్కడ హేమాహేమీలను తన చీపురుతో ఊడ్చేశారు ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్ లో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది బీజేపీ. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఈ ఎన్నికల్లో ప్రజల దృష్టి అంతా ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ఫలితాలపైనే ఉంది. అయితే.. యూపీలోని పలు ప్రముఖ పార్టీల కంటే నోటాకే అధిక శాతం ఓట్లు పడడం చర్చనీయాంశంగా మారింది. అందుకు సంబంధించిన వివరాలను ఎన్నికల సంఘం వెబ్సైట్లో పేర్కొంది. యూపీ ఎన్నికల్లో కేవలం నోటాకే 0.69 శాతం ఓట్లు పడటం గమనార్హం.
100 సీట్లలో పోటీచేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఎంఐఎం 0.47 శాతం ఓట్లు మాత్రమే పొందిందని ఈసీ తెలిపింది. ఆప్ 0.35 శాతం, జేడీయూ 0.11, సీపీఐ 0.07శాతం, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) ఎల్జేపీలు 0.01 శాతం చొప్పున ఓట్లు తెచ్చుకున్నాయని పేర్కొంది.
ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీకి 41.6 శాతం ఓట్లు వచ్చాయని తెలిపింది. రెండో స్థానంలో నిలిచిన సమాజ్వాదీ పార్టీ 32 శాతం ఓట్లు దక్కించుకోగా.. వీటి తర్వాత బీఎస్పీకి 12.8శాతం, ఆర్ఎల్డీకి 3.02శాతం, కాంగ్రెస్ కు 3.02 ఓట్లు పోల్ అయినట్టు ఈసీ వెల్లడించింది.