ఉపాద్యాయ వృత్తి ఎంత గొప్పదో తెలియంది కాదు. కొందరు జీతం కోసం మాత్రమే ఈ ఉద్యోగాన్ని చేస్తుంటారు. వచ్చే జీతం, ఎగ్గొట్టాల్సిన పాఠం, తీసుకోవాల్సిన సెలవులు, నొక్కాల్సిన బెనిఫిట్స్.. వాళ్ళ ఆలోచనలన్నీ వీటిచుట్టూనే తిరుగుతాయి. ఇంకొందరు ఈ ఉద్యోగాన్ని జీతంకోసం కాదు, తమజీవితంగా భావించి చేస్తుంటారు. ప్రతీక్షణాన్నీ విద్యార్థుల కోసమే వినియోగిస్తారు.
అలాంటి వాళ్ళలో తమిళనాడులోని అరియలూరు జిల్లా జయంకొండ సమీపంలోని కారైక్కురిచ్చి స్యూల్లోని కలైయరసన్ మాస్టారు ఒకరు. ఈ మాస్టారు ఎంత గొప్పవాడంటే 12 యేళ్ళలో ఒక్క సెలవుకూడా పెట్టలేదు. వినడానికే వింతగా ఉంది కదూ.!
ఉండదా మరి..!వేతన జీవులు అప్పుడప్పుడు సెలవులు పెట్టడం సహజం. తప్పనసరి కూడాను. అందులోనూ నేటి గవర్నమెంటు టీచర్స్ లో కొంతమందైతే మరింత ప్రత్యేకం. సహజంగా వచ్చే సెలవులు చాలక, చీటికిమాటికీ సెలవులు పెడుతూనే ఉంటారు. ప్రైవేటు సంస్థల్లో అయితే సెలవుల కోసం కుంటిసాకులు చెబుతుంటారు. మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఇదే తంతు.
అయితే, కలయరసన్ మాస్టారు దీనికి పూర్తి వ్యతిరేకం పుష్కర కాలంగా ఒక్క సెలవు కూడా తీసుకోకుండా పనిచేస్తున్నారు. అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. వానొచ్చినా వరదొచ్చినా ఆయనెప్పుడూ విధులకు డుమ్మాకొట్టలేదు.
సింతామణి గ్రామానికి చెందిన ఆయన కారైక్కురిచ్చి గ్రామంలోని హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అంతకుముందు ఆయన కాట్టుమన్నార్ గుడి, సిలాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేశారు.
2014 నుంచి కారైక్కురిచ్చిలో పనిచేస్తున్న ఆయన ఈ మధ్యకాలంలో ఒక్కటంటే ఒక్క సెలవు కూడా తీసుకోలేదు. తన పనులను సెలవు రోజుల్లో పూర్తి చేసుకుంటూ వస్తున్న ఆయన విద్యార్థులు స్కూలుకు రావడానికి ముందే పాఠశాలలో వాలిపోతారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేంద్రన్ మాట్లాడుతూ.. కలైయరసన్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. సెలవు రోజుల్లో ప్రభుత్వం తరపున పాఠశాలకు వచ్చే సంక్షేమ సాయాన్ని కూడా ఆయన విద్యార్థులకు అందిస్తారని చెప్పారు. ఇలాంటి వాళ్ళు నూటికో కోటికో ఒక్కరుంటారు. వీళ్ళనే మనుషులలో దేవుడంటారు.