సిద్ధిపేట జిల్లాలో ఓ వసతి గృహంలో కలుషితమైన ఆహారం తిని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నిన్న అర్ధరాత్రి నుంచి వాంతులు, విరేచనాల సమస్యతో విద్యార్థినులు అవస్థలు పడ్డారు. దీంతో వెంటనే గురుకుల పాఠశాల వసతిగృహంలోనే విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
పాఠశాలలో మొత్తం 326 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం విద్యార్థులకు చికెన్తో భోజనం వడ్డించారు. మిగిలిన గ్రేవీని రాత్రిపూట వండిన వంకాయలో కలిపి వడ్డించారు. దీంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయాన్నే నిర్వాహకులు స్థానిక వైద్య సిబ్బందికి సమాచారం అందించగా హుటాహుటిన చేరుకొని అక్కడే చికిత్స ప్రారంభించారు.
విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని తెలంగాణ మైనారిటీ గురుకులాల సంస్థ రాష్ట్ర సహాయ కార్యదర్శి యూసఫ్ అలీ, జిల్లా విజిలెన్స్ అధికారి గౌస్ పాషా, మైనారిటీ గురుకులాల జిల్లా ఇన్ఛార్జి గోపాల్రావు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, సంబంధిత నివేదికను మైనారిటీ గురుకులాల రాష్ట్ర అధికారులకు సమర్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.