భోజనం వికటించి విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన వరంగల్ నగరంలో జరిగింది. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పరం గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు రాత్రి భోజనం వికటించడంతో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన వెంటనే విద్యార్థులకు విరోచనాలు కావడంతో వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వసతి గృహంలో విద్యార్థులకు రాత్రి భోజనంలో ఆలుగడ్డ కూర, పచ్చిపులుసు వడ్డించారు. ఇది తిన్న వెంటనే రాత్రి నుంచి అందరికీ విరోచనాలు అవుతున్నాయని విద్యార్థినిలు తెలిపారు. విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో వసతి గృహం సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.