ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మరో వివాదం నెలకొంది. సొంత పార్టీ నేతలే ఒకరిపై మరొకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఎన్టీఆర్, వైఎస్సార్ లను ఉద్దేశించి ఎంపీ జీవీఎల్ నరసింహా రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా పేరును ఒక జిల్లాకు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్, వైఎస్ ఆర్ పేర్లను మాత్రమే ఉపయోగించడాన్ని ఆయన తప్పు బట్టారు. టీడీపీ అధికారంలో ఉంటే ఎన్టీఆర్ పేరు.. వైసీపీ అధికారంలో ఉంటే వైఎస్సార్ పేరు పెడుతున్నారని జీవీఎల్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ‘అన్నీ ఇద్దరి పేర్లేనా’ అంటూ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలను పురందేశ్వరి ప్రస్తావించారు. ‘ఒకరు తెలుగు జాతికి గుర్తింపు తీసుకొచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం అందించారు.
2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివి ప్రజలకు అందించారు. మరొకరు ఫీజు రీయింబర్స్ మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు, ఆరోగ్యశ్రీ అందించారు’ అంటూ ట్వీట్ చేశారు. ‘ఆ ఇద్దరు కాదు.. ఆ మహానుభావులు’ అని మరో ట్వీట్ చేశారు.
కాగా రాష్ట్రంలో చాలా కాలంగా అన్నింటికీ ఆ ఇద్దరి పేర్లే కనిపిస్తున్నాయంటూ పరోక్షంగా ఎన్టీఆర్, వైఎస్సార్ లను ఉద్దేశించి జీవీఎల్ వ్యాఖ్యానించారు. ఏది చూసినా ఆ కుటుంబం.. లేదా ఈ కుటుంబం.. అన్నీ ఇద్దరి పేర్లేనా? మిగతా నాయకులెవరూ కనిపించరా? అని ప్రశ్నించారు.
“అన్నీ ఇద్దరి పేర్లేనా”
ఒకరు తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం– 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందిస్తే , మరో కరు ఫీజు రీయింబర్స్మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు,ఆరోగ్యశ్రీ అందించారు pic.twitter.com/bFPSbCBKV1
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) February 17, 2023